Jagga Reddy on Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో ఏపీలోని ప్రధాన రాజకీయ నాయకులు విఫలమయ్యారని జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును ప్రశ్నిస్తూ, “సినిమాల్లోనే కాదు, బయట కూడా పవన్ కళ్యాణ్ యాక్టింగే చేస్తున్నారా?” అని నిలదీశారు. గతంలో ఎన్నికల సమయంలో “ఉక్కును కాపాడుతాం.. ప్రైవేటీకరణను ఎండగడతాం.. అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తాం” అన్న మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రకటనలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
విశాఖ ఉక్కు అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది ఆంధ్రుల హక్కు అని, దాని వెనుక 32 మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు. “చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురికీ ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు?” అని నిలదీశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఢిల్లీ వెళ్లి గట్టిగా అడిగే సాహసం ఎవరూ చేయడం లేదని, వీరంతా కేవలం ప్రజల ముందు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రా ప్రజలు, ఉక్కు కార్మికులు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “రాజకీయ నాయకులు చేసే ఈ దారుణమైన యాక్టింగ్ను ప్రజలు ఎందుకు గమనించడం లేదు? ఇంకా ఏ మైకంలో ఉన్నారు?” అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కులాల ప్రాతిపదికన విడిపోవడం వల్లే నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలారా మేల్కొనండి అంటూ పిలుపునిచ్చారు. నాయకుల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, అందుకే ఈ ముగ్గురు నేతలు కేంద్రం మీద ఒత్తిడి తేవడం లేదని ఆయన విమర్శించారు.
Also Read: దారుణం.. మదనపల్లి జిల్లాలో ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిరుపేద మహిళ బలి.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్కు రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోయినా, కార్మికుల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ఫైలు మీదనే మొదటి సంతకం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత నాయకులు కేవలం తమ పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ బయట కూడా యాక్టింగే చేస్తున్నారా?
ఎండగడతాం, పొడుస్తాము అన్నాడు ఏమైంది?
ఆంధ్రా ప్రజలు దీనిపై ఏం ఆలోచన చేస్తున్నారు?
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు ఇంత దారుణమైన యాక్టింగ్ చేస్తున్నారా?… pic.twitter.com/wmCzOmYrd8
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025