MLA Arava Sridhar: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎక్కడ? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? ఆయనపై వస్తున్న విమర్శలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆ పార్టీ వేసిన కమిటీ ముందుకైనా ఆయన వస్తారా? మహిళ ఆరోపణలను తిప్పికొడతారా? ఇవే ప్రశ్నలు ఆ నేతలను వెంటాడుతున్నాయి.
అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్?
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. తనపై ఓ మహిళ చేసిన ఆరోపణపై వివరణ ఇస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన నేతలు ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ అని వస్తోందని అంటున్నారు.
ఒక్కోసారి ఔటాప్ సర్వీసు అని వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిచ్చిన సలహాల మేరకు రేపో మాపో ఆయన బయటకు వచ్చే అవకాశముందని అంటున్నారు శ్రీధర్ అనుచరులు. మరోవైపు శ్రీధర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఓ కమిటీని నియమించింది.
శ్రీధర్ ఫోన్ స్విచ్ఛాఫ్.. న్యాయనిపుణులతో సంప్రదింపులు
వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ కమిటీ ముందుకు అరవ శ్రీధర్ వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో తొలుత కుటుంబసభ్యులను పిలిచి వారి వెర్షన్ తీసుకోవాలని ఆలోచన చేస్తోందట జనసేన. చివరకు శ్రీధర్ నుంచి వివరణ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా జనసేన మద్దతుదారులు బాధిత మహిళతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. జనసేనను బద్నామ్ చేయడానికి ప్రత్యర్థులు వేసిన ఎత్తుగా చెబుతున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళ కొన్ని విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. జనసేన మద్దతుదారులు మాత్రం ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న వారిపై విచారణ చేయించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై బాధిత మహిళ గురువారం మీడియా ముందుకొచ్చే అవకాశముందని అంటున్నారు.