Kadapa Bus Accident: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పెను ప్రమాదం తప్పింది. మైలవరం మండలంలో భక్తులతో వెళ్తున్న ఒక టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పది మందికి పైగా గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది భక్తులు ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. వీరంతా కన్యతీర్థం వెళ్లే మార్గంలో భాగంగా, మైలవరం మండలంలోని ప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయానికి సమీపిస్తున్న తరుణంలో బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది.
ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా పట్టేయడంతో (స్టీరింగ్ తిరగకపోవడంతో) డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండటంతో పెద్ద పెట్టున కేకలు వినిపించాయి. స్థానికులు వెంటనే స్పందించి, అద్దాలు పగులగొట్టి భక్తులను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలవ్వగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాతబడిన బస్సులను నడపడం వల్లే ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Road accident: స్కూల్ బస్సును ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరు మృతి, విద్యార్థులకు గాయాలు