Case filed on YS Sharmila(Andhra pradesh political news) : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లా.. బద్వేల్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, ఆమెకు బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద హత్య కేసు విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడంతో షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్యకేసు అంశాన్ని ఎన్నికల వేళ ప్రస్తావించొద్దని ఇప్పటికే కడప కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి.. షర్మిల మరోసారి వివేకా హత్యకేసుపై ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిపై కూడా కేసు నమోదైంది. ఇటీవలే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. ఆ సమయంలో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి పార్టీ కండువాతో పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి వెళ్లడం వివాదాస్పదమైంది. దీనిపై ఆర్వో శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : వైఎస్ షర్మిల ఆగ్రహం, జగన్ పడేసిన బిస్కట్లు.. 1000 కోట్ల పనులా?
కాగా.. ఏపీ రాజకీయాలు మొన్నటి వరకూ వివేకా హత్యకేసు చుట్టూనే తిరిగాయి. అధికార వైసీపీపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. చెల్లెళ్లకే న్యాయం చేయలేని జగన్.. సీఎంగా రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. వివేకా హత్యకేసు గురించి ప్రచారంలో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించినా షర్మిల మళ్లీ అవే వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.