సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం మొదలైందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుందని విమర్శించారు. దాడులకు భయపడవద్దని, త్వరలో జరగబోయే జెడ్పీ ఎన్నికలకు సిద్ధమై భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం 9 మంది అధికారులను కొత్త సిట్లో నియమించింది. అందులో ఐదుగురు ఐపీఎస్లు ఉన్నారు. రేపు సుప్రీంకోర్ట్ విచారణ నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడంపై ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. మోడీ సర్కార్.. గాంధీ సిద్ధాంతాలను చంపేస్తూ.. కార్పొరేట్ల కోసం పనిచేస్తోందని విమర్శించారు. బీజేపీ వికసిత్ భారత్ కాకుండా గాంధీ ముక్త భారత్ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు ఎంపీ వంశీ.
విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో రన్వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అచ్చం నాయుడు, బొత్స సహా 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం రద్దు కావడంతో వెంకయ్య నాయుడు స్వర్ణ భారత్ ట్రస్ట్కు వెళ్లారు.
గుడి నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చందాలు అడగడం సిగ్గుచేటని విమర్శించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను 20 లక్షల రూపాయలు ఇస్తానని, పెద్దారెడ్డి కూడా సొంత నిధులు కేటాయించాలని సవాల్ చేశారు. చందాల పేరుతో కుటుంబ గౌరవం చెడగొట్టుకోవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. పథకాల పేర్లు మార్చే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలోని భూములను రూపాయికే కట్టబెడుతూ చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తప్పిదాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటో విచారించాలని కోరారు.
అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి విమర్శించారు. యూరియా, మెడికల్ కాలేజీలపై జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని, రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ ఇంటి ముందు హిజ్రా స్వాతి ధర్నా చేశారు. ఆ ఇంట్లోని దంపతులు తనను నమ్మించి నగదు, బంగారం తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని, నిందితులపై అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఉప్పిరిపేటలో అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు రాత్రిపగలు సాగుతున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా కనమర్లపుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని కనమర్లపుడికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు పోలీసులు. బస్సు శ్రీశైలం నుంచి మంగళగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
విజయవాడలో పిల్లల విక్రయ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గతంలో అరెస్టై బెయిల్పై వచ్చిన సరోజినీ ముఠా మళ్ళీ దందా సాగిస్తుండగా.. సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐదుగురు పిల్లలను రక్షించి, 3.30 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. సత్యసాయిబాబా ఆలయం నుంచి ఇంటికి వెళుతున్న లక్ష్మి అనే వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు. వెంకటరాయుని చెరువు వద్ద చీకటిగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 22 లక్షల రూపాయల విలువైన 44 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
నేషనల్ హెరాల్డ్, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పాలమూరులో బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ నేతలు. పత్రిక ఆస్తులు కాంగ్రెస్వేనని, గాంధీ కుటుంబాన్ని వేధిస్తే సహించబోమని వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి హెచ్చరించారు. బీజేపీ తన సైకో ఇజాన్ని వీడాలని డిమాండ్ చేస్తూ వనపర్తిలో భారీ ధర్నా చేపట్టారు.
హైదరాబాద్ బాలాపూర్లో 57 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు ఏసీపీ జానకిరెడ్డి. ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. నేరాలు చేయడం ఆపి.. కుటుంబాలతో గౌరవంగా జీవించాలని సూచించారు. రాత్రివేళల్లో బయట తిరగొద్దని ఆదేశించారు. వారి కదలికలపై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు.
ఇటీవలి సంక్షోభం నుంచి కోలుకుని విమాన సర్వీసులు పునరుద్ధరించినట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరారు. దాదాపు 65 వేల మంది ఉద్యోగులతో అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సేవలందిస్తున్నామని తెలిపారు.
టారిఫ్ అనే పదం తనకెంతో ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అనేక దశాబ్దాల పాటు ఇతర దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా దీన్ని వినియోగించాయన్నారు. ఇకపై అది కుదరదని తెలిపారు. అమెరికాలో తయారుచేసే వాటికి సుంకాలు ఉండవనే కారణంతో అనేక కంపెనీలు దేశానికి తిరిగి వస్తున్నాయని చెప్పారు.
ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ మూవీ ఆస్కార్ 2026 షార్ట్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఎంపికైన 15 చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. కుల, మత వివక్షపై పోరాడే ఇద్దరు స్నేహితుల కథతో దర్శకుడు నీరజ్ మైవాన్ తెరకెక్కించారు.
టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దైంది. దీనిపై అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. దీంతో ఇకపై మ్యాచ్లు జరిగే వేదికల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.
ఇవాళ సాయంత్రం భారత్, సౌతాఫ్రికా మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 2-1 తేడాతో టీమిండియా ఆధిక్యంలో ఉంది. పొగమంచు కారణంగా నాలుగో టీ20 రద్దు అయింది. దీంతో ఐదో టీ20 మ్యాచ్ కీలకంగా మారింది.