మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండ్రోజుల కిందట తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక నిగూఢ పరమార్థం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ ఏదైనా నినాదం ఎత్తుకున్నారంటే దానివెనుక రాజకీయ ఎత్తుగడ ఉంటుందని అందుకే మరోసారి ఆయన ఇక్కడ సీఎం రేవంత్.. ఏపీలో చంద్రబాబును బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. ఇక ముందు కూడా చేసే అవకాశాలు లేకపోలేదని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కేసీఆర్ మొన్న మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాలను ఏపీ ఎత్తుకెళ్తున్నదని, ఇక్కడి రేవంత్ సర్కార్ మొద్దునిద్ర పోతున్నదని విమర్శించారు. తమ హయాంలో పాలమూరు-రంగారెడ్డిని పరుగులు పెట్టించామని, అన్ని అనుమతులు తెచ్చామని.. పాలమూరు ఎత్తిపోతల కోసం భారీ మోటార్లను సైతం అక్కడ ఏర్పాటుచేశామని చెప్పారు. 70శాతం వరకు పనులను తమ హయాంలో పూర్తిచేస్తే కాంగ్రెస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నల్లమల లింక్ ప్రాజెక్టు పేరుతో గోదావరి నుంచి సైతం నీళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే రేవంత్ సర్కార్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని అన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకుని పడావు పెట్టారని, ఆయన హయాంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వెనక్కినెట్టివేయబడిందని చెప్పారు.
ఎన్డీయేతో పొత్తు వలన చంద్రబాబు ఏది చెబితే కేంద్రం అంటే వింటుందని అందుకే పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపిందని కేసీఆర్ ఆరోపించారు.చంద్రబాబు రాజకీయ గురువు అయినందున రేవంత్ సైతం తెలంగాణ జలాలను ఏపీకి తరలించేందుకు సైలెంట్గా ఉన్నారని పరోక్షంగా ఆరోపించారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోత్స్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అధికారానికి దూరమైన కేసీఆర్.. మరోసారి ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
2014-2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రాజెక్టులను ఎందుకు కంప్లీట్ చేయలేదని ప్రశ్నించారు.అధికారం కోసమే కేసీఆర్.. తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నాడని.. అందుకే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం,సీఎం చంద్రబాబు మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావడానికి కేసీఆరే కారణమని.. ఇప్పుడు ఏపీ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని మాట్లాడటం వెనుక అర్థం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులని, రాజకీయాల పేరిట ప్రాంతాల మధ్య విద్వేషం సృష్టించడం సరికాదన్నారు.చంద్రబాబు వల్లే ఇప్పుడు నదీ జల్లాల్లో తెలంగాణకు నష్టం కలుగుతోందని బూచిగా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని, రాష్ట్ర స్వప్రయోజనాల కోసం పోరాడేది తమ పార్టీయే అని ప్రజలను నమ్మించడానికే టీడీపీని బద్నాం చేయడానికి కేసీఆర్ పూనుకున్నారని మండిపడ్డారు.