సింగపూర్లో చోటుచేసుకున్న ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు భారతీయ ప్రయాణికులు తన ట్యాక్సీలో వాంతులు చేసుకుని.. అసభ్య పదజాలంతో దూషించారు. అంతే కాకుండా, కనీస శుభ్రత పాటించకుండా తనను అవమానించారని లూ సామ్ అనే క్యాబ్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను, ఫోటోలను ఆయన ఫేస్బుక్ వేదికగా పంచుకున్నారు.
మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన
డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోజు రాత్రి ఇద్దరు భారతీయ పురుషులు తన క్యాబ్ను బుక్ చేసుకున్నారు. వారు ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారని.. ప్రయాణ సమయంలో కారు వెనుక సీటులో వాంతులు చేసి వాహనాన్ని అపరిశుభ్రం చేశారని సామ్ పేర్కొన్నారు. కారు అంతా వాంతులతో నిండిపోయిందని.. దాని వల్ల దుర్వాసన వెదజల్లుతోందని ఆయన ఆవేదన పడ్డారు. ఆ సమయంలో ఆ ప్రయాణికులు కనీస పశ్చాత్తాపం కూడా చూపలేదని ఆయన చెప్పుకొచ్చారు.
డ్రైవర్ ను బిక్షగాడు అంటూ…
కారును శుభ్రం చేయడానికి అయ్యే ఖర్చును ఇవ్వాల్సిందిగా డ్రైవర్ కోరగా.. దీనికి ఆ ప్రయాణికులు నిరాకరించారు. కేవలం 10 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) మాత్రమే ఇస్తామని మొండికేశారు. డ్రైవర్ను భిక్షగాడు అంటూ నోటికొచ్చినట్లు దూషించారు. ‘ఆ 10 డాలర్లు తీసుకోవడం కంటే నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం. అందుకే ఆ డబ్బును తిరస్కరించి… నా కోపాన్ని దిగమింగుకున్నాను’ అని సామ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
రాత్రంతా కష్టపడితే గానీ..
తమ పిల్లల చదువుల కోసం, కుటుంబ అవసరాల కోసం రాత్రంతా కష్టపడి పని చేసే డ్రైవర్లపై ఇలాంటి ప్రవర్తన చూపడం సిగ్గుచేటని సామ్ మండిపడ్డారు. ఈ ఘటన వల్ల ఆ రాత్రి ఆయన మరిన్ని ట్రిప్పులు వేయలేకపోయానని బాధపడ్డారు. కారులో వస్తున్న జీర్ణం కాని కర్రీ, మద్యం వాసన కారణంగా ఇతర ప్రయాణికులను ఎక్కించుకోవడం సాధ్యపడలేదు. దీనివల్ల ఆ రోజు ఆదాయాన్ని కోల్పోయానని.. ఒక సామాన్య ట్యాక్సీ డ్రైవర్ను ఇలా వేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో స్పందన
సామ్ కుమార్తె కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. తన తండ్రి తమ చదువుల కోసమే ఇంత కష్టపడుతున్నారని మదర్షిప్ అనే వార్తా సంస్థకు తెలిపారు. విదేశాల్లో పనిచేసే భారతీయులు లేదా పర్యాటకులు ఇలాంటి బాధ్యతారహితమైన పనులకు పాల్పడటం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాధితుడైన డ్రైవర్కు మద్దతుగా అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ఎవరైనా సరే, తోటి మనుషులకు ఇచ్చే కనీస గౌరవాన్ని మర్చిపోకూడదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ALSO READ: Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!