Hyderabad News : హైదరాబాద్ చైతన్యపురిలోని మంజుసుధ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమంగా అబార్షన్ చేయడానికి ప్రయత్నించడం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
సైదాబాద్ ఖాజాభాగ్ కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గర్బిణీ అయిన సునీతకు..ఈ నెల 10వ తేదీన మంజుసుధ హాస్పిటల్లో అబార్షన్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఈ నెల 18వ తేదీ సాయంత్రం బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఈరోజు సునీత కన్నుమూశారు.
సునీత మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మంజుసుధ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. సునీత మృతికి మంజుసుధ ఆస్పత్రి యాజమాన్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రిని తక్షణమే సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ: Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!