Teacher Attacks minor girl: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీవివేకానంద ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు పేరుతో చిన్నారిని స్కేల్తో కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చెల్లూరు గ్రామానికి చెందిన ఆ బాలిక నొప్పితో బాధపడుతూ ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు విషయాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నపిల్లలపై ఇలాంటి దాడులు సహించబోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా చిన్నారిని కొట్టిన టీచర్తో పాటు ఆమెను నియంత్రించడంలో విఫలమైన స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్లో పిల్లలకు భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ యాజమాన్యాన్ని నిలదీశారు. ధర్నాతో స్కూల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి వాసంశెట్టి అక్కడి పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరమని, చిన్నపిల్లలపై హింస ఏమాత్రం సహించరాదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ స్కూల్స్పై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని మంత్రి వాసంశెట్టి తెలిపారు. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం ముఖ్యమని పేర్కొంటూ.. స్కూల్ యాజమాన్యాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ALSO READ: Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?