BJP MLAs Sleeping: తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా ప్రతిపక్షాల తీరు విస్మయం కలిగించింది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి సీరియస్ చర్చ జరుగుతుండగా.. సభలో ఉన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతూ (కునుకు తీస్తూ) కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. వాస్తవాలను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి పారిపోయారని, బీజేపీ నేతలేమో బాధ్యతారాహిత్యంగా నిద్రపోతున్నారని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు.
గతంలో కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే సంప్రదాయాలకు విరుద్ధమని నాడు లేఖలు రాసిన ఉత్తమ్, భట్టి.. నేడు అదే పద్ధతిని అనుసరించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో తమ విజ్ఞప్తిని తిరస్కరించారని గుర్తుచేస్తూ.. మంత్రి ఉత్తమ్కు పీపీటీ అవకాశం ఇచ్చినట్లే, తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.