EC Appointment IPS in AP: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఉదయం పదిలోపు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.
2019 ఎన్నికల సమయంలోనూ విశ్వజిత్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది ఎన్నికల సంఘం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగైదు నెలలు అదే పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత ఆయన్ని తప్పించి, అక్కడి నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పంపింది. ఆ తర్వాత విజిలెన్స్, ఏసీబీ డీజీగా పనిచేశారు. 1994 బ్యాచ్కి చెందిన కుమార్ విశ్వజిత్, ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా పని చేస్తారనే పేరు ఆయన సొంతం.
విజయవాడ కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం ఏసీబీలో ఆయన డైరెక్టర్గా పని చేస్తున్నారు. 2001 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణ, ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో చిత్తూరు ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఈయన సొంతూరు కైకలూరు. అక్కడే జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఏయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2001లో గ్రూప్ 1కు ఎంపికై, తొలుత డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
ALSO READ: దేవాలయాలను కూడా వదలని వైసీపీ.. ఇక డిపాజిట్లు గల్లంతే: చంద్రబాబు
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. వైసీపీ ప్రభుత్వం క్లోజ్గా ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారి స్థానాల్లో కొత్తగా కుమార్ విశ్వజిత్, పీహెచ్డీ రామకృష్ణను నియమించింది. ఏపీకి కొత్త ఐపీఎస్ అధికారులు పేర్లు తెలియగానే వైసీపీ నేతల్లో వణుకు మొదలైనట్లు ప్రచారం సాగుతోంది. కొత్తగా వచ్చిన ఇద్దరు అధికారులు ఎవరి మాట వినరని, అందువల్లే జగన్ సర్కార్ వీళ్లని వేరు శాఖకు పంపారని అంటున్నారు. మొత్తానికి ఐదేళ్ల పాలించిన సర్కార్కు ఊహించని కుదుపుగా చెబుతున్నారు నేతలు.