సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేళ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేశ్ లక్ష్యంగా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. నారా కుటుంబ చరిత్ర మొత్తం మోసాలతో నిండిపోయిందని ఆరోపించారు. కన్నతండ్రి ఎన్టీఆర్ను చెప్పులతో కొట్టి అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తన భర్తకు జరిగిన అవమానంపై ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
లోకేశ్ రాజకీయ స్థాయిపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. జగన్ ముందు లోకేశ్ ఎందుకు పనికిరారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల మేనేజ్మెంట్ వల్లే లోకేశ్ ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో కాకుండా అక్రమ పద్ధతుల్లో గెలిచారని విమర్శించారు. లోకేశ్ తన వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుతూ లోకేశ్పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘మీ మేనత్తలు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా? మీ అమ్మకు వారంటే ఇష్టం లేదు. అసలు మీ మేనత్తలు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?’ అని ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యులతోనే సంబంధాలు సరిగ్గా లేనివారు పరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తనకు లోకేశ్తో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ.. ‘ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా దగ్గరకు వచ్చావా? కనీసం నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా?’ అంటూ నిలదీశారు.
చంద్రబాబు రాజకీయ వ్యూహాలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ తన మనుషులను పెట్టుకుని చంద్రబాబు అడ్డదారుల్లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో కూడా చంద్రబాబు కోవర్టులు ఉన్నారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్కొన్నారు. నైతికత లేని రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని విమర్శించారు.
వైసీపీ పాలనలో మహిళల సంక్షేమం అద్భుతంగా జరిగిందని లక్ష్మీపార్వతి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళల సాధికారత కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తు చేశారు. నిజమైన నాయకుడు అంటే జగన్లా ఉండాలని ప్రశంసించారు. మహిళల గౌరవాన్ని కాపాడే వ్యక్తి జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. నారా కుటుంబం కేవలం అధికారం కోసమే పాకులాడుతుందని.. జగన్ మాత్రం ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారని.. ఆయన వారసుడిగా చెప్పుకునే అర్హత లేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
ALSO READ: బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం.. కేసీఆర్ సంచలన ప్రకటన!