AP Liquor scam: గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్కు సన్నిహితంగా మెలిగిన ఆయన మద్యం ముడుపులతో తెలంగాణలో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.
ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తుల కొనుగోలు
కృష్ణమోహన్రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో రూ.51 లక్షల నగదు చెల్లించి కొనుగోలు చేసిన మూడు ప్లాట్ల వివరాలను అధికారులు పసిగట్టారు. నిన్న బాన్సువాడకు వెళ్లి అక్కడి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్నిగ్ధారెడ్డి పేరుతో రిజిష్టర్ చేసిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ ఆస్తులకు చెల్లించిన సొమ్ము మద్యం ముడుపులేనని సిట్ పక్కా ఆధారాలు సేకరించింది.
ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసిన అధికారులు
తెలంగాణలోని మహేశ్వరం, రామచంద్రపురంలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు డాక్యుమెంట్లు సేకరించి జప్తునకు రంగం సిద్ధం చేశారు. రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులకు సంబంధించి జప్తు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కృష్ణమోహన్రెడ్డి బాగోతంపై ఆదాయ పన్ను శాఖకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారంతో బంధుత్వం
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణమోహన్రెడ్డి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కారణం ఏంటని సిట్ కూపీ లాగింది. అటు జగన్కు, భవిష్యత్తులో ఇటు దర్యాప్తు సంస్థలకు తెలిసే అవకాశం లేకుండా హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన కుమారుడు రోహిత్ రెడ్డికి తెలంగాణలో అన్నివిధాలా బలగం ఉండాలని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డితో వివాహం జరిపించారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి పొరుగు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందించింది.
వెలుగులోకి ఏ1 రాజ్ కసిరెడ్డికి సంబంధించిన స్థిరాస్తులు
ఇప్పటికే ఏ1 రాజ్ కసిరెడ్డికి సంబంధించి భారీగా స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. వాటిని జప్తు చేసిన అధికారులు ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులున్నాయా? అనే కోణంలో కూపీ లాగుతున్నారు.
Also Read: నంద్యాలలో ఘోర విషాదం.. ట్రాక్టర్ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి
13కు చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య
లిక్కర్ ముఠా పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం మద్యం ముడుపుల సొమ్ముతో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేయడం, కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయడం, సూట్ కేసు కంపెనీల ద్వారా మనీలాండరింగ్కు పాల్పడటం వంటి అంశాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. సుమారు యాభై మందికి పైగా నిందితులను సిట్ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఇటీవలే ముంబైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 13కు చేరింది.
లిక్కర్ స్కామ్లో తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు
వెలుగులోకి మాజీ సీఎం జగన్కు ఓఎస్డీగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు
తెలంగాణలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిట్
ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తుల కొనుగోలు
రేపు ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం… pic.twitter.com/qj4vFozwID
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2025