Crime News: నంద్యాల జిల్లా పగిడ్యాల నెహ్రూ నగర్లో ఆదివారం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పగిడ్యాలలోని నెహ్రూ నగర్ లో ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా.. గొడుగు చేతన్ అనే రెండేళ్ల బాలుడు స్పాట్లోనే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో ఒక ఇంటి నిర్మాణ పనుల కోసం ఇటుకలను తీసుకురావడానికి ట్రాక్టర్ను తెప్పించారు.
ట్రాక్టర్ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి..
ట్రాక్టర్ డ్రైవర్ ఇటుకలను దించిన తర్వాత, వాహనాన్ని రివర్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆడుకుంటున్న చిన్నారి చేతన్ అకస్మాత్తుగా ట్రాక్టర్కు దగ్గరగా రావడంతో, డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని వెనక్కి తీయడంతో బాలుడు టైర్ల కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన చేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పరారైన ట్రాక్టర్ డ్రైవర్
ఈ ప్రమాదం జరగగానే, ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బాలుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కళ్లెదుటే తమ గారాలపట్టి విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య, ప్రియుడు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.