Nara Lokesh US Tour: ఏపీ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. టెక్ రంగ సంస్థలు, పెట్టుబడి భాగస్వాములు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యా రంగ నిపుణులతో వరుసగా సమావేశాలు జరుపుతూ ఏపీ సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో లోకేష్ పర్యటన మరింత వేగం పుంజుకుంది. ప్రముఖ పెట్టుబడి సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్, గ్లోబల్ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా నుండి చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, అలాగే ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మ్యాట్లతో కూడిన సమావేశాలు కీలకంగా నిలిచాయి. ఏపీ ఐటీ రంగ సామర్థ్యం, మౌలిక వసతులు, నైపుణ్యవంతులైన మానవ వనరులు, కొత్తగా అమలు చేస్తున్న విధానాల గురించి లోకేష్ వారికి సమగ్రంగా వివరించారు.
విశాఖపట్నాన్ని ఐటీ, డేటా హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే అక్కడ క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అనేక కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయని, ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. విశాఖ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టెక్ డెస్టినేషన్ అవుతోంది. వచ్చే నాలుగేళ్లలో ఇది అంతర్జాతీయ స్థాయి డేటా, డిజిటల్ సర్వీసెస్ హబ్ అవుతుంది అని లోకేష్ అమెరికా పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయాలని.. సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ను లోకేష్ విజ్ఞప్తి చేశారు. సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్, డ్రోన్స్ వంటి అధునాతన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని వివరించారు. ముఖ్యంగా విశాఖ, బెంగుళూరు, హైదరాబాద్ టెక్ ట్రయాంగిల్ వ్యూహాత్మకంగా ఏపీకి అనుకూలంగా ఉందని తెలిపారు.
పెట్టుబడుల చర్చలతో పాటు, లోకేష్ పర్యటనలో ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ రంగం కూడా ప్రధాన అంశంగా నిలిచింది. ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్ మ్యాట్తో విద్యార్థుల డిజిటల్ స్కిల్లింగ్, కోర్సు మాడ్యూల్స్, టెక్ ట్రైనింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ల గురించి మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తు పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాలు ఇవ్వడం మా లక్ష్యం. గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాలు మరింత పెంచుతాం అని ఆయన అన్నారు.
Also Read: గుంతకల్ పాలిటిక్స్ లోకి వారసులొచ్చారు!
అమరావతిలో అభివృద్ధి చేస్తోన్న ఎంటర్టైన్మెంట్ సిటీ, ఫిల్మ్ ప్రొడక్షన్ జోన్, డిజిటల్ క్రియేటివ్ స్టూడియోలు గురించి కూడా రోబ్ గిగిలియోతో లోకేష్ చర్చించారు. క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థను అమరావతి క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్, డిజిటల్ డిజైన్ రంగాల్లో భారీ ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని తెలిపారు.
అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీ బిజీ..
ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కొనసాగుతున్న లోకేష్ టూర్
శాన్ ఫ్రాన్సిస్కోలో సెలెస్టా వీసీ, మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్, కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్… pic.twitter.com/3K8R9pUk19
— BIG TV Breaking News (@bigtvtelugu) December 9, 2025