Tirumala News: తిరుమల.. ఈ పేరు వింటేచాలు భక్తులు పులకించిపోతారు. ఏడు కొండల వెంకటేశ్వరస్వామిని ఎప్పుడు దర్శించుకుంటామా? అని తహతహలాడు తుంటారు. అలాంటి భక్తుడికి అన్యాయం జరిగితే.. ఆ స్వామి ఊరుకుంటాడా? చివరకు వినియోగదారుల కమిషన్ ఆదేశాలతో వెనక్కి దిగొచ్చింది టీటీడీ. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్టోరీలోకి వెళ్తే..
సరిగ్గా 2008 నవంబరు 26న మహబూబ్నగర్కు చెందిన చంద్రశేఖర్ ఫ్యామిలీ ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ, మరుసటి రోజు అంటే శుక్రవారం నిర్వహించే మేల్ చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకుంది. దీనికిగాను రూ.21,250తో టీటీడీ పేరిట డీడీ తీసి దాన్ని తిరుమల పేష్కార్ కార్యాలయంలో ఇచ్చాడు.
స్లాట్ బుకింగ్ ప్రకారం 2021 సెప్టెంబరు 10న చంద్రశేఖర్ ఫ్యామిలీకి సేవల్లో పాల్గొనేందుకు అర్హత కల్పించింది టీటీడీ. అయితే కేటాయించిన స్లాట్ ప్రకారం కోవిడ్ కారణంగా వాటిని రద్దు చేశామని తెలిపింది టీటీడీ. దాని స్థానంలో బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
దీనికి శ్రీవారి భక్తుడు చంద్రశేఖర్ ఫ్యామిలీ ససేమిరా అంది. ఈ సేవల కోసం తాము పుష్కరకాలం పాటు ఎదురు చూశామని తెలిపింది. ఈ విషయంలో టీటీడీ ప్రతిపాదన సరిగా లేదని వెల్లడించింది. చివరకు చంద్రశేఖర్ మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం కమిషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పలురకాలుగా సమాచారం సేకరించింది కమిషన్.
ALSO READ: ఏపీలో వింత ప్రదేశం.. ఇదొక మాయా ప్రపంచమే
దరఖాస్తు మేరకు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం భక్తుల కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది వినియోగదారుల కమిషన్. ఒకవేళ ఈ తీర్పును ఉల్లఘింస్తే చంద్రశేఖర్ ఫ్యామిలీలో దరఖాస్తు చేసుకున్న దంపతులుకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని కమిషన్ న్యాయమూర్తి గతేడాది మే 8న తీర్పు ఇచ్చారు.
టీటీడీపై గెలిచిన భక్తులు
వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది టీటీడీ. దీనిపై రాష్ట్ర వినియోగ దారుల కమిషన్ను ఆశ్రయించింది. అయితే ఈ వివాదాన్ని జిల్లా కమిషన్లో తేల్చుకోవాలని సూచించింది. దీనిపై కమిషన్ నాలుగు రోజుల కిందట అంటే మే 15న జరిగిన విచారణ చేపట్టింది.
గతంలో ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటారా? తీర్పులో 50 శాతం డిపాజిట్ చేస్తారో తేల్చుకోవాలని ఆదేశించింది కమిషన్. కమిషన్ ఆదేశాలతో టీటీడీ చివరకు దిగొచ్చింది. చివరకు చంద్రశేఖర్ ఫ్యామిలీకి శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. ఆగస్టు 14, 15న రెండురోజుల్లో శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది టీటీడీ. అందుకు సంబంధించిన టికెట్ల స్వయంగా పంపింది.