Medak Bar Association: మెదక్ బ్యూరో, స్వేచ్ఛ- మెదక్ బార్ అసోసియేషన్ (Medak Bar Association) అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది కొలుకూరి జనార్ధన్ రెడ్డి (K Janardhan Reddy).. సమీప ప్రత్యర్థి, న్యాయవాది మార్కంటి రాములు పై 57 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాములుకు కేవలం 14 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా శోభన్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రావు, సహాయ కార్యదర్శిగా వేణుగోపాల చారి, స్పోర్ట్స్ కార్యదర్శిగా రవి గౌడ్.. ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి, న్యాయవాది సిరిగ ప్రభాకర్ ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మమత మంజుల, హరీఫ్ హుస్సేన్, కే ఎన్ ఎన్ దత్తు, బి ప్రశాంత్లు ఎన్నికయ్యారు. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన జనార్ధన్ రెడ్డి ఏడాది కాలం పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగనున్నారు. గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానూ జనార్ధనరెడ్డి కొనసాగారు.
సీనియర్ న్యాయవాదిగా మంచి పేరు ఉన్న జనార్థన్ రెడ్డి మెదక్ బార్ అసోసియేషన్కు 2వ సారి అధ్యక్షునిగా గెలుపొందారు. మెదక్ లైన్స్ క్లబ్లో కీలకంగా పనిచేస్తూ లైన్స్ గవర్నర్గా సేవలందించారు. వెల్దుర్తి మండలం కుక్ నూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఎయిడ్స్ వ్యాధితో చనిపోగా వారి పిల్లలిద్దరిని అన్నీ తానై చదివించారు. స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో చదివించి చేరదీశారు. జనార్ధన్ రెడ్డి భార్య రజిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమంలో సహితం ఆమె ఉత్సాహంగా పాల్గొంటారు.