మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏపీ రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. ఎందుకంటే అమరావతి చుట్టుపక్కల భూములు మొత్తం తెలుగుదేశం పార్టీ బినామీలవే అని ఆయన ముందు నుంచి బలంగా ఆరోపిస్తున్నారు.ఏదేమైనా జగన్ మరోసారి సీఎం అయితే.. రాజధాని అమరావతిపై నీలినీడలు కమ్ముకోనున్నాయని టాక్ వినిపిస్తోంది. జగన్ అందుకే ముందే ‘మావిగన్’ విషయంలో హింట్ ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. అదే నిజమైతే అమరావతి రైతులు మరోసారి ఆగం అవుతారని ప్రచారం జరుగుతోంది.
కూటమి సర్కార్ అధికారంలోకి రెండున్నరేండ్లు కావొస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఇంకా రెండున్నరేండ్లు కావాలి. 2029లో జమిలి ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు సైతం పెరుగుతాయి. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించేందుకు ఈనెల 16 నుంచి స్పెషల్ సెషన్స్ను కేంద్రం నిర్వహిస్తోంది. ఎన్డీయే ఎంపీలకు విప్స్ కూడా జారీ అయ్యాయి. కేంద్రం వేగంగా వేస్తున్న అడుగుల వలన రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయే అవకాశం ఉన్నది. పెరిగిన అసెంబ్లీ, ఎంపీ సీట్లలో 33శాతం వారికి సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. వైసీపీకి ఇది కొత్త తలనొప్పిగా మారనుంది. మహిళలు, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు రిజర్వు అయితే టికెట్ రాని వాళ్లు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. అధికార కూటమలోని అసంతృప్తులు వైసీపీలోకి వచ్చే చాన్స్ లేకపోలేదు.
2014లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రాజధాని అమరావతి నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్ వ్యతిరేకించారు. తీరా అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్ణయాన్ని పూర్తి గా వెనక్కి తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరమీదకు తెచ్చారు. ఐదేండ్లు పాటు కాలయాపన చేసి రాజధాని అభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. తీరా జనాలు ఇచ్చిన తీర్పుతో ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. కాగా, కూటమి సర్కార్ టర్ము అయిపోయేలోపు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది.అందుకే శరవేగంగా రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు.
విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!
ఇదే సమయంలో అమరావతి మీద పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం చేసే బదులు విజయవాడ, గుంటూరు, మచీలీపట్నం మధ్యలో రాజధాని నిర్మాణాలు కట్టాలని, నిధులు కేటాయించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు.కేవలం అమరావతి మీద కాకుండా అదే ఇన్వెస్ట్మెంట్ రెండు మూడు ప్రాంతాల మీద పెడితే ప్రజలు లబ్ధిపొందుతారని, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని అంటున్నారు.ఈ విషయంలో జగన్ అస్సలు వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి కూటమి సర్కార్ నష్టపరిహారం చెల్లించలేదని, అలాంటప్పుడు మరో 50వేలకు పైగా ఎకరాలు సేకరించి ఏం చేస్తారని సమయం దొరికప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత వచ్చినా రాజధాని నిర్ణయం, పాలనా వ్యవహారాలు సీఎం చేతిలోనే ఉంటాయని జగన్ స్పష్టంచేశారు.