Lokesh vs Ysrcp: ఏపీ శాసనమండలిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య ఉద్యోగాల అంశంపై వాడీ వేడీ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. ఉద్యోగాల కల్పన అంశంపై కూటమి-వైసీపీ సభ్యుల మధ్య రగడ చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగం అంశం తెలుగు- ఇంగ్లీష్లో ప్రచురణల మధ్య తేడా ఉండడంతో చిన్నపాటి గందరగోళం నెలకొంది.
ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అని చెప్పడం ఏంటని వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారామె. నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని స్పష్టంగా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
వెంటనే మంత్రి నారాలోకేష్ జోక్యం చేసుకున్నారు. తాము ఉద్యోగాలు ఇచ్చామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాత్రమే చెప్పామన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. వాకౌట్ చేయవద్దని అన్నింటిపై చర్చిద్దామన్నారు.
ఇంగ్లీష్ మీడియం కావాలని వైసీపీ అంటోందని, ఇంగ్లీష్లో చెబితే ఇబ్బందిగా ఉందని అంటున్నారని తెలిపారు మంత్రి. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. తప్పులుంటే మార్చుకుంటామని చెప్పాలన్నారు.
ALSO READ: మూడు దశాబ్దాల తర్వాత.. ఏం జరిగింది?
ఈ క్రమంలో మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు. వైసీపీ నుంచి సీరియస్ రియాక్ట్ రావడంతో వెంటనే ఫైర్ అయ్యారు మంత్రి లోకేష్. దళితులపై ఎవరు దాడి చేశారో అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో మాటలొద్దన్నారు. మీకు సంబంధం లేని సబ్జెక్టు మాట్లాడుతున్నారని వైసీపీ ఎదురుదాడి చేసింది.
దళితులపై దాడి చేసింది మీరు.. ఆపై గుండు కొట్టించింది కూడా మీరేనని అన్నారు మంత్రి లోకేష్. ఇప్పుడు ఇలా మాట్లాడుతారా? అంటూ విరుచుకుపడ్డారు. అంతకుముందు అధికార-విపక్షాల మధ్య ఇంగ్లీష్ మీడియంపై రగడ చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు.
దీనిపై హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యులు కావాలని తెలుగును అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు మీడియంలో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయం వైసీపీ ఎమ్మెల్సీలకు తెలియదా అంటూ మండిపడ్డారు. వైసీపీ సభ్యులు తమ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సదరు మంత్రి.
ఇంగ్లీష్ మీడియం అంటూ ఊదరగొట్టారు.. ఇంగ్లీషు చదవలేరా: నారా లోకేష్
ఉద్యోగాల కల్పన అంశంపై ఏపీ శాసనమండలిలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం pic.twitter.com/d51eNfvFKn
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025