ఏపీలో సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక పాలసీని త్వరలో తీసుకు రాబోతున్నట్టు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఈ పాలసీ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచేలా ఉంటుందన్నారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఆలోచిస్తున్న విషయాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై కూడా లోకేష్ ఘాటుగా స్పందించారు.
అన్వేష్ ట్వీట్ కి స్పందించిన లోకేష్..
బెట్టింగ్ యాప్స్, ఆ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ వరుస వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్లు పెట్టారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ తో కూడా అన్వేష్ మాట్లాడేవారు. అన్వేష్ ఆరోపణలను బేస్ చేసుకుని కొంతమంది సెలబ్రిటీలను ఇటీవల తెలంగాణ పోలీసులు విచారణకు పిలిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వ స్పందన కోసం మరో ట్వీట్ వేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ని కోరుతూ ఆయన ట్వట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
Betting apps are destroying lives. I get to hear hundreds of heart-wrenching stories about youngsters being pushed into despair because of their addiction to gambling. This has to stop. The long-term solution is continuous awareness and acting tough on betting apps. We are… https://t.co/rf4XFaU42t
— Lokesh Nara (@naralokesh) April 18, 2025
గోవింద యాప్..
సాక్షాత్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు ప్రమోట్ చేస్తున్నారని అన్వేష్ ఆరోపించారు. ఆయాప్ ఇంకా లైవ్ లోనే ఉందని, పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ఈ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. అమాయక యువత ఈ యాప్ ల బారిన పడి మోసపోతున్నారని, తమ జీవితాలు బలి చేసుకుంటున్నారని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అన్వేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి మంత్రి లోకేష్ స్పందించారు.
చట్టపరంగా చర్యలు..
బెట్టింగ్ యాప్ ల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. కొన్ని వందల సంఘటనలు తనకూ తెలుసన్నారు. దీనికి దీర్ఘకాలిక పరిష్కార మార్గం వెదకాల్సిన అవసరం ఉందన్నారు. బెట్టింగ్ యాప్స్ పై నిరంతర అవగాహన కల్పిస్తూ కార్యాచరణ రూపొందించాలన్నారు. అదే సమయంలో ఓ ప్రత్యేక పాలసీ తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. తమ ప్రభుత్వం అదే పనిలో ఉందని, దేశానికే ఆదర్శంగా ఉండే ఒక పాలసీ తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ ముప్పుని అంతం చేయడానికి చట్టపరమైన మార్గాలను కనుగొంటున్నామని చెప్పారు.
ఇటీవల బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లను విచారణకు పిలిపించింది. కొంతమంది పోలీస్ విచారణకు హాజరయ్యారు కూడా. వారినుంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. వారంతా ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయము అని దారికొచ్చారు. ఏపీ పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. ప్రత్యేక పాలసీ ద్వారా బెట్టింగ్ యాప్స్ పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది.