Minister Sandhyarani: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఒక మహిళతో చేసినట్లు చెబుతున్న చాటింగ్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ చాటింగ్లో పృథ్వీ ఆమె పట్ల అసభ్యకరంగా మాట్లాడారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్షాట్ల ప్రకారం.. పృథ్వీ ఆ మహిళతో వ్యక్తిగత సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో భాగంగా పృథ్వీ.. ‘జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకుండా.. వేస్ట్ చేసుకుంటున్నావ్..’ అని ఆమెను ప్రశ్నించినట్లు ఉంది. అంతేకాకుండా, ఆమెకు అనేక మంది ఇష్టపడేవారు ఉన్నారని.. పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్లు కూడా నిన్ను ఇష్టపడుతున్నారని చెప్పినట్లు ఆరోపణలున్నాయి.
‘నేను చెప్పినట్టు విను.. చాలా మంది నిన్ను ఇష్టపడుతున్నారు’ అంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు కూడా చాటింగ్లో కనిపిస్తోంది. అయితే, ఈ సంభాషణ కేవలం మెసేజ్ల ద్వారా కాకుండా ప్రశాంతంగా మాట్లాడాలంటూ పృథ్వీ ఆమెను కోరినట్లు కూడా ఉంది. అదే చాటింగ్లో బాధితురాలుగా చెబుతున్న మహిళ పట్ల పృథ్వీ ప్రవర్తనపై తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నా బర్త్ డే రోజు ఎన్ని సార్లు కాల్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు.. కనీసం నాకు విష్ చేయలేదు’ అంటూ ఆమె నిరాశను పంచుకున్నట్లుగా వైరల్ మెసేజ్లలో ఉంది. ఈ మొత్తం సంభాషణల సారాంశం చూస్తుంటే వారిద్దరి మధ్య వ్యక్తిగత పరిచయం, సాన్నిహిత్యం ఉన్నట్లు అర్థమవుతున్నా, పృథ్వీ భాష, సంభాషణ తీరుపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చాటింగ్ వ్యవహారం ప్రస్తుతం వైరల్గా మారినప్పటికీ.. ఈ సంభాషణల నిజానిజాల గురించి తెలియాల్సి ఉంది. ఈ చాటింగ్ స్క్రీన్షాట్లు మార్ఫింగ్ చేసినవా? లేక నిజంగానే పృథ్వీ, ఆ మహిళ మధ్య జరిగిన సంభాషణలేనా? అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి లేదా ఆమె కుమారుడు పృథ్వీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
ఈ వివాదంపై ఫిర్యాదులు అందిన పక్షంలో లేదా సుమోటోగా కేసు నమోదు చేస్తే.. పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ALSO READ: Andhra King Taluka: థియేటర్లో అమ్మాయికి ముద్దు… అలాంటి ఎక్స్పీరియన్స్పై డైరెక్టర్ ఓపెన్ కామెంట్