Satya Kumar: ఈ రోజుల్లో నిజమైన ప్రజా సేవ అందించే రాజకీయ నాయకులు అరుదుగా కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి.. ఓట్లు అడిగి, ఆ తర్వాత కనీసం చుట్టపు చూపుగా కూడా కనిపించని నాయకులే ఎక్కువ. కానీ, అప్పుడప్పుడూ కొందరు నాయకులు.. తాము చేసే పనులు వల్ల ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు. పేద ప్రజలకు సాయం చేసే గొప్ప మనసును చాటుకుంటారు. తాజాగా ఏపీ మంత్రి సత్యకుమార్ స్టూడెంట్స్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పదో తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ అండగా నిలిచారు. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న సుమారు 1800 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆయన ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. నిరుపేద కుటుంబాల విద్యార్థులు ఫీజు భారం కారణంగా పరీక్ష రాయలేక పోవద్దనే ఉద్దేశంతో మంత్రి ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థుల టెన్త్ పరీక్ష ఫీజు మొత్తం తానే చెల్లిస్తానని ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్కు అధికారికంగా లేఖ రాశారు.
ధర్మవరం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1800 మంది విద్యార్థిని విద్యార్థుల టెన్త్ పరీక్ష ఫీజు మొత్తం రూ.2.34 లక్షలు అయింది. సాధారణంగా.. ఇలాంటి సందర్భాల్లో నాయకులు ప్రభుత్వ నిధుల నుంచో లేదా పార్టీ ఫండ్ నుంచో సాయం చేయడం చూస్తుంటాం. కానీ, మంత్రి సత్యకుమార్ ఈ మొత్తం డబ్బును తన సొంత నిధుల ద్వారానే చెల్లించడానికి ముందుకొచ్చారు. పేద విద్యార్థులకు సాయం చేయాలనే తపనతో.. ఎవరి సహాయం తీసుకోకుండా తన వ్యక్తిగత డబ్బుతోనే ఈ ఫీజును చెల్లించారు. ఈ చర్య పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గొప్ప ఊరట కలిగించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరీక్ష ఫీజు కట్టలేక తమ పిల్లల చదువు ఆగిపోతుందేమో అని భయపడిన అనేక కుటుంబాలకు ఇది పెద్ద భరోసా ఇచ్చింది.
మంత్రి సత్యకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం నిజమైన ప్రజా సేవకు నిదర్శనం. ప్రజల కష్టాలను గుర్తించి.. వారి సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా ముందుకు రావడం రాజకీయ విలువలను పెంచింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా, పేద విద్యార్థులు పరీక్ష రాయడానికి దోహదపడిన ఆయన చర్య, నిస్సందేహంగా వేళ్లపై లెక్కించదగిన కొద్దిమంది నాయకులలో ఆయన ఒకరిగా నిలబెడుతుంది. విద్యార్థులు ఫీజు భారం లేకుండా పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. భవిష్యత్తులో మరికొందరు నాయకులు కూడా మంత్రి సత్యకుమార్ ఆదర్శాన్ని పాటిస్తారని ఆశిద్దాం.
ALSO READ: Drumstick: ఈ సమస్యలు ఉన్నవాళ్లు మునక్కాయల్ని తింటే అంతే సంగతులు!