Kapu vs Kamma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)ను వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర అభ్యంతరకరమైన మాటలతో దూషించడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. చంద్రబాబుతో పాటు ఆమె తల్లిని దూషించడాన్ని తట్టుకోలేని టీడీపీ శ్రేణులు.. అంబటి నివాసం వద్ద రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే అంబటిని అరెస్టు చేయడం, ఆయన్ను గతంలో చంద్రబాబును ఉంచిన రాజమండ్రి జైలుకు తరలించడం చకా చకా జరిగిపోయాయి. అయితే ఈ వివాదంలోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. అంబటి ఎపిసోడ్ ను కాపు వర్సెస్ కమ్మ (Kapu vs Kamma)గా మార్చే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై జనసేన (Janasena), టీడీపీ (TDP) శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అంబటి రాంబాబు అరెస్టు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కాపునేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham).. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ (Nara Lokesh)కు బహిరంగ లేఖ రాశారు. గాడితప్పిన కూటమి పాలనలో దహనకాండను చూస్తున్నానని వ్యాఖ్యానించారు. కాపు నేత అయిన అంబటి అరెస్టును ఖండిస్తూ చంద్రబాబు తన పాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. తొలి నుంచి కాపుల మీద రగిలిపోతూనే ఉన్నారని ఆక్షేపించారు. డిప్యూటీ సీఎం (పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి) మీద ఉన్న ప్రేమతో ఈసారి కాపులు పెద్ద ఎత్తున మీకు (చంద్రబాబు) మద్దతు ఇచ్చారని.. దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే ప్రయత్నం చేయకండి అంటూ చంద్రబాబు, లోకేశ్ లను ఉద్దేశించి ముద్రగడ పేర్కొన్నారు.
అంబటి ఎపిసోడ్ ను కాపు కులంపై జరుగుతున్న దాడిగా ముద్రగడ అభివర్ణించడాన్ని జనసేన, టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో అదే కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను.. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో తిట్టినప్పుడు ఎందుకు మౌనం వహించారని నిలదీస్తున్నారు. ‘మూడు పెళ్లిళ్లు’, ‘ప్యాకేజీ స్టార్’, ‘దత్త పుత్రుడు’, ‘కాపు నా కొ*డుకు’ అని పవన్ పై సూటిపోటి మాటలతో వైసీపీ నేతలు విమర్శించినప్పుడు.. ఈ పౌరుషం ఎక్కడికి పోయిందని ముద్రగడను నిలదీస్తున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడవాళ్లను ప్రస్తావిస్తూ అసహ్యంగా మాట్లాడినప్పుడు.. ఎందుకు ఖండించకుండా మిన్నకుండిపోయారని ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబు.. చంద్రబాబును అన్న మాటలు చూసి కూడా ఆయన వ్యాఖ్యలకు కాపు కాస్తున్నారా? అంటూ టీడీపీ శ్రేణులు, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
Also Read: Pawan Kalyan: నేనే మాట్లాడాలా.. మీరెందుకు ఉన్నారు?.. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ సీరియస్ వార్నింగ్!
తనను తాను కాపు ఉద్యమనేతగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం.. ఏనాడు కాపుల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కాపులు.. పవన్ కళ్యాణ్ వెనుక ర్యాలీ కాగా.. ముద్రగడ మాత్రం వైసీపీ అధినేత జగన్ పై ఉన్న స్వామి భక్తితో జనసేనానికి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమని పదే పదే ఆయన చెబుతూ వచ్చారు. ఒకవేళ పవన్ గెలిస్తే.. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అప్పట్లో శపథం కూడా చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం, వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో.. తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ముద్రగడకు వచ్చింది. లేనిపోని ఆవేశాలతో కాపు కులం నుంచి బయటకొచ్చి రెడ్డిగా మారిన ముద్రగడ.. ఇప్పుడు మళ్లీ కాపుల కోసం ఒకత్తా పుచ్చుకోవడం ఏంటని కూటమి పార్టీకి చెందిన కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. మెుత్తంగా ముద్రగడ రాసిన బహిరంగ లేఖ.. ఏపీలో కమ్మ వర్సెస్ కాపు అన్న వివాదాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చింది.