Anirudh Reddy: మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ , మాజీ మంత్రులపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ పై విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల గతంలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల కంటిచూపుతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న పవన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజానికి పవన్ ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదని.. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. కొండగట్టు అంజన్న ఆలయ శిలాఫలకంపై ఆయనకు గౌరవం ఇచ్చినా.. ఆయన తీరు మారలేదని మండిపడ్డారు. కేవలం ఇక్కడి విలువైన భూములపై కన్ను వేసి.. రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని.. ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ సాగవని హెచ్చరించారు.
మాజీ మంత్రులపై ఎదురుదాడి
మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలపై అనిరుధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
అక్రమ సంపాదనపై దేవుని ముందు ప్రమాణం చేయమంటున్న మాజీ మంత్రులు.. తాము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని అదే దేవుని సాక్షిగా ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగింది అభివృద్ధి కాదని.. కేవలం భూకబ్జాలు, సెటిల్మెంట్లు మాత్రమేనని ఆరోపించారు. ట్యాంక్ బండ్ అభివృద్ధి కోసం కాకుండా.. కమిషన్లు దక్కలేదనే బాధతోనే మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే పాలమూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు గెలుచుకుని.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల అరాచకాలకు స్వస్తి పలికి, ప్రజా పాలన అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ కి ప్రొడ్యూసర్ చంద్రబాబు, కో ప్రొడ్యూసర్ లోకేష్, కొత్త ప్రొడ్యూసర్ మోదీ : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణలో జనసేనకు ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని తెలిసే పర్యటనని రద్దు చేసుకున్నాడు
మా సెంటిమెంట్ పై మాట్లాడిన పవన్, క్షమాపణలు చెప్పమని అడిగినా చెప్పలేదు… pic.twitter.com/XZyw0b2Bzr
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2026