Mylavaram: పెళ్లి మండపం నిండా బంధుమిత్రుల కోలాహలం.. ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరోవైపు వేద మంత్రాల ఉచ్చారణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సరిగ్గా సుముహూర్త సమయానికి వధూవరుల తలపై జీలకర్ర-బెల్లం పెట్టారు. ఇక మరికొన్ని నిమిషాల్లో మాంగల్య ధారణ జరుగుతుందనగా.. అక్కడ జరిగిన ఒక ఊహించని పరిణామం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.
సీన్ రివర్స్.. పీటలపై నుంచి లేచి.. ప్రియుడి చెంతకు!
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వరుడి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. శాస్త్రోక్తంగా జీలకర్ర-బెల్లం కార్యక్రమం పూర్తయ్యాక, తాళి కట్టే సమయానికి ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఒక యువకుడు హడావుడిగా మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే వధువు ముఖంలో స్పష్టమైన మార్పు కనిపించింది.
“వచ్చావా” అంటూ పీటల మీద నుంచి లేచిన పెళ్లికూతురు, మండపం దిగి నేరుగా ఆ యువకుడి పక్కన నిలబడింది. ఈ హఠాత్పరిణామానికి వరుడు, పురోహితులు, అక్కడ ఉన్న బంధువులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
రంగంలోకి పోలీసులు.. తలకిందులైన ఏర్పాట్లు
“ఇతను మా ఊరి అబ్బాయి.. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు” అంటూ వధువు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో మండపంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన కొందరు బంధువులు యువకుడిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో గలాటా మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెళ్లి నిలిచిపోయింది.
లక్షల ఖర్చు.. ఆవిరైన కలలు
వరుడి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. “మాకు ఉన్నది ఒక్కడే కుమారుడు. ఎన్నో ఆశలతో రూ. 20 లక్షలు ఖర్చు చేసి వివాహాన్ని ఘనంగా తలపెట్టాం. వేల మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశాం. అందరి ముందు మా పరువు తీసేశారు” అని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: రాయదుర్గంలో ఆనాడు తప్పు చేశా.. సీఎం చంద్రబాబుకు డీఎల్ఎఫ్ సంస్థ హామీ
పంచాయితీతో ముగింపు
శనివారం ఉదయం ఇరువర్గాల వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించుకున్నారు. జరిగిన నష్టానికి సంబంధించి, తలెత్తిన వివాదాలను పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కరించుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో వధువు తీసుకున్న నిర్ణయం ఆ ఊరిలో పెద్ద సంచలనంగా నిలిచింది.