ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి ఆమె. కాలు బయటపెడితే చాలు వ్యక్తిగత వాహనాలు, డ్రైవర్లు. దూర ప్రయాణం అయితే విమాన సౌకర్యం, తలచుకుంటే ప్రైవేట్ ఛాపర్ లు.. అన్నీ ఆమెకు సమకూరే అవకాశం ఉంది. కానీ ఆమె సాధారణ మహిళలతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అది కూడా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఉపయోగించుకుని జీరో టికెట్ తీసుకున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎలా ఉందనే విషయాన్ని ఆరా తీశారు.
కుప్పం మహిళలతో కలిసి ఉచిత బస్సు లో ప్రయాణించిన నారా భువనేశ్వరి గారు pic.twitter.com/VIoJHOA5Fw
— Telugu Desam Party (@JaiTDP) November 21, 2025
స్త్రీ శక్తి..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఈ పథకం అమలులోకి రాగా, ఏపీలో స్త్రీ శక్తి పేరుతో కూమి ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెచ్చింది. పథకం అమలు చేసే రోజు లాంఛనంగా నేతలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి సతీమణి పథకం అమలు తీరుని పర్యవేక్షించేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ఇక్కడ విశేషం. కుప్పం పర్యటనకు వెళ్లిన ఆమె. శాంతిపురం వద్ద తన నివాసం నుంచి బయటకు వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీ టికెట్ పొందారు. తుమ్మిసి వరకు బస్సులో వెళ్తూ మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆరా తీశారు.
కుప్పంలో సుడిగాలి పర్యటన..
సీఎం చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటంతో ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంపై ఫోకస్ పెంచారు. తరచూ కుప్పం వస్తున్న ఆమె స్థానిక నేతలతో సమావేశమవుతూ, పార్టీని పటిష్టం చేస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. కుప్పం నియోజకవర్గం నడింపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు భువనేశ్వరి. మహిళలతో కలిసి కోలాటం ఆడారు. గంగమ్మ దేవతను దర్శించుకున్నారు. తుమ్మిసి పెద్ద చెరువు జల హారతి కార్యక్రమం పాల్గొన్నారు.
తుమ్మిసి పెద్ద చెరువు జల హారతి కార్యక్రమం పాల్గొన్న నారా భువనేశ్వరి గారు pic.twitter.com/PCanGpkIJO
— Telugu Desam Party (@JaiTDP) November 21, 2025
కుప్పంలోని శాంతిపురంలో నివాసంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన నారా భువనేశ్వరి, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కుప్పంకు 7 పరిశ్రమలు రాబోతున్నాయని, అందులో మూడు పరిశ్రమలు కేవలం మహిళలకే ఉద్యోగాలు కల్పిస్తాయని ఆమె చెప్పారు. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులతో కూడా భువనేశ్వరి భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది మెగా డీఎస్సీకి ఎంపికైన 20మంది ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. కుప్పం నియోజకవర్గం నుంచి 117 మంది మెగా డీఎస్సీకి ఎంపికకావడం సంతోషకరం అని చెప్పారు. కుప్పం KGBV స్కూల్ విద్యార్థులతో కలసి సపపంక్తి భోజనం చేశారు భువనేశ్వరి. కుప్పంలో ఒక మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేసిన నారా భువనేశ్వరి గారు
నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి పర్యటనలో నారా భువనేశ్వరి గారిని… pic.twitter.com/bER7NhLHyq
— Telugu Desam Party (@JaiTDP) November 21, 2025
మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా సాగిందని టీడీపీ అంటోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలతో బిజీగా ఉంటే, ఆయన సొంత నియోజకవర్గం యోగక్షేమాలను ఆయన భార్య భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు.
Also Read: మాకు ఇంకా ముప్పు ఉంది.. ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు