Telangana Maoist Surrender: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అటవీ ప్రాంతాల్లో అజ్ఞాతంలో ఉంటూ దళాల్లో పనిచేస్తున్న 37 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం (నవంబర్ 22, 2025) తెలంగాణ డీజీపీ సమక్షంలో వీరంతా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో రాష్ట్ర కమిటీ స్థాయి (SCM) అగ్ర నాయకుల నుండి సాధారణ దళ సభ్యుల వరకు ఉన్నారు. హింసా మార్గాన్ని వీడి, సాధారణ పౌరులుగా జీవించాలనే ఉద్దేశంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక అగ్రశ్రేణి నాయకులు ఉండటం గమనార్హం. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలానికి చెందిన కోయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ గత 31 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా (SCM) మరియు BK-ASR డివిజనల్ కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే, పెద్దపల్లి జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధ నాయకుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ కూడా లొంగిపోయారు. ఇతను గత 32 ఏళ్లుగా పార్టీలో ఉంటూ టెక్నికల్ విభాగం ఇన్-ఛార్జ్గా పనిచేస్తున్నారు. వీరితో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ముచ్చకి సోమడా (ఎర్ర) కూడా పోలీసులకు లొంగిపోయారు.
ఈ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిల కేడర్ బయటకు వచ్చింది. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు (DVCM), తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు (ACM), మరియు 22 మంది దళ సభ్యులు ఉన్నారు. కేవలం లొంగిపోవడమే కాకుండా, కెఎం (KM) డివిజన్కు చెందిన ఏడుగురు సభ్యులు తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తిని పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక ఏకే-47, రెండు ఎస్ఎల్ఆర్ (SLR), నాలుగు .303 రైఫిల్స్, ఒక జీ3 (G3) తుపాకీతో పాటు వివిధ కాలిబర్లకు చెందిన 346 తూటాలు ఉన్నాయి. ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఏ రకంగా బయటికి వచ్చిన మావోయిస్టులకు అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘‘మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా వచ్చినా, రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా మేము స్వాగతీస్తాం. పార్టీ పరంగా విబేధాలు, ఆరోగ్య కారణాలు,ఇలా అనేక కారణాలు తో బయటికి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద 20 లక్షల రివార్డ్ ఉంది. అప్పాసి నారాయణ మీద 20 లక్షలు రివార్డ్ ఉంది. మిగతా వారికి 25 వేల రూపాయల నగదు ఇస్తున్నాం. 1.41 కోటి రూపాయల రివార్డ్ను 37 మందికి రివార్డ్గా ఇస్తున్నాం.’’ అని డీజీపీ అన్నారు. 11 నెలలో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 59 మంది తెలంగాణ కు చెందిన మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం 9 మంది కేంద్ర కమిటీలో ఉండగా, అందులో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారని, 10 మంది స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని డీజీపీ వెల్లడించారు.
Read Also: Nara Bhuvaneswari: ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి సతీమణి