Nara Lokesh: టీడీపీ కార్యకర్త, అభిమాని మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. ఏం కష్టం వచ్చిందో కానీ లోకేష్ అభిమాని శీను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. అన్నా.. అన్నా… అని పిలిచేవాడివి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివని ఆవేదన వ్యక్తం చేసారు. తన పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ… అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు అని పేర్కొన్నారు. శీను బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే అతడిని బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదన్నారు. సారీ శీను.. నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను.. అంటూ శీను కుటుంబానికి లోకేష్ భరోసా ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలు ఏం ఉన్నా భయపడవద్దని ధైర్యం చెప్పారు. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్నారు. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని లోకేష్ అభిమానులను, కార్యకర్తలను కోరారు.