రప్పా రప్పా.. పుష్ప సినిమా రిలీజైనప్పటికంటే ఏపీ రాజకీయాలతో ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ముందుగా ప్రతిపక్ష నేతలు రప్పా రప్పా అంటూ హడావిడి మొదలు పెట్టారు. ఈ రప్పా రప్పా చివరకు పోలీస్ కేసుల వరకు వెళ్లింది. రప్పా రప్పాలో తప్పేముందంటూ జగన్ ప్రశ్నించడం మరో హాట్ టాపిక్. అంతగా నచ్చకపోతే ఆ సినిమా నుంచే డైలాగ్ తొలగించాలంటూ ఆయన వితండవాదం మొదలు పెట్టారు. ఇక తాజాగా ఈ రప్పా రప్పాపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ డైలాగ్ కి చిరంజీవి డైలాగ్ తో బదులిచ్చారు లోకేష్. రప్పా రప్పా అంటే ఏపీ పోలీసులు చూస్తూ ఊరుకోరని, రఫ్ఫాడించేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
దళితులపై దాడులా?
తిరుపతిలో దళిత యువకుడిపై జరిగిన దాడిని ట్విట్టర్ వేదికగా ఖండించారు మంత్రి లోకేష్. ఏపీలో ఇలాంటి దాడులకు చోటు లేదన్నారాయన. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు పెచ్చు మీరాయన్నారు. డాక్టర్ సుధాకర్ ని దారుణంగా హింసించారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసి దళితులపై దమనకాండ జరిపారని చెప్పారు. అధికారం పోయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు లోకేష్.
#YCPDalitHorrorInTirupati#AndhraPradesh
ప్రజలు ఛీత్కరించినా వైసిపి నాయకుల బుద్ధి మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై దమనకాండ జరిపిన వైసిపి నాయకులు ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తున్నారు.… pic.twitter.com/IFf5VQHnVD
— Lokesh Nara (@naralokesh) August 7, 2025
తిరుపతిలో ఏం జరిగింది?
తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం ఎదురుగా ఉన్న దుకాణం విషయంలో వైసీపీ నేతలకు, దళిత యువకుడు పవన్ కి మధ్య గొడవ జరిగింది. ఆ దుకాణం కాంట్రాక్ట్ను తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగారనేది ప్రధాన ఆరోపణ. పవన్ ని కిడ్నాప్ చేసి ఎంఆర్పల్లిలోని తన ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారని తెలుస్తోంది. సదరు యువకుడిని చితకబాదుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. భూమన కరుణాకర్రెడ్డి అనుచరుల ఆగడాలు పెచ్చుమీరి పోతున్నాయని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత కూడా స్పందించారు. రౌడీ రాజకీయాలకు ఏపీలో కాలం చెల్లిందని అన్నారామె. ఇలాంటి దాడులను పోలీసులు చూస్తూ ఊరుకోబోరాని చెప్పారు.
కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఆగడాలు పెరిగిపోయాయని, వారే దాడులకు ముందుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వైసీపీ ఆగడాలపై ఆ పార్టీ నేతలు సైలెంట్ గా ఉండటం విశేషం. పైగా ఇలాంటి దాడుల్ని సమర్థిస్తున్నట్టుగా పార్టీ అధినేత రప్పా రప్పా అనే డైలాగులు కొట్టడం మరింత ఆక్షేపణీయం అంటున్నాయి టీడీపీ శ్రేణులు. తాజాగా నారా లోకేష్ ట్వీట్ ఇదే విషయాన్ని హైలైట్ చేస్తోంది. రప్పా రప్పా అంటే ఏపీ పోలీసులు చూస్తూ ఊరుకోబోరని ఆయన హెచ్చరించారు. రప్పా రప్పాకు రఫ్ఫాడించడమే సరైన గుణపాఠం అని అన్నారాయన.