ఏపీలో తల్లికి వందనం పథకం అమలు రాజకీయ రచ్చలేపింది. ఇప్పటి వరకూ అసలా పథకం అమలు కాలేదని విమర్శించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు 13వేలు మాత్రమే ఎందుకిస్తున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చదువుకునే ప్రతి బిడ్డకు 15వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, అందులో 2 వేలు లోకేష్ అకౌంట్ లోకి వెళ్తున్నాయంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం ఓ రేంజ్ లో జరుగుతోంది. దీనిపై నారా లోకేష్ స్వయంగా స్పందించారు. తప్పుడు ప్రచారం అంటూ ఆయన మండిపడ్డారు. అంతే కాదు. 24 గంటల ఛాలెంజ్ విసిరారు.
లోకేష్ వార్నింగ్..
తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. వారికి తాను 24 గంటలు టైమ్ ఇస్తున్నానని.. ఆలోగా ఆ ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు లోకేష్. దమ్ముంటే, అది నిరూపించండి, లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి అని అన్నారు. ఆ రెండూ చేయలేకపోతే తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు లోకేష్. ఫేక్ ప్రచారం పై కఠినమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
.@ysjagan .. నీకు @naralokesh నుంచి మరో సవాల్…
"తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం… pic.twitter.com/tiZJWL6Idu
— Telugu Desam Party (@JaiTDP) June 13, 2025
గతంలో ఒక్కరికే..
గత వైసీపీ ప్రభుత్వం స్కూల్ కి వెళ్లే పిల్లలకోసం అమ్మఒడి అనే పేరుతో పథకం ప్రారంభించింది. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఒకరికి మాత్రమే డబ్బులు జమ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఆ హామీ అమలు చేసింది. అయితే గతంలో లాగే స్కూల్ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ కోసం అందులో 2వేల రూపాయలు కట్ చేశారు. అంటే గతంలో జగన్ ప్రభుత్వం ఎంత ఇచ్చేదో ఇప్పుడు కూడా అంతే ఇచ్చారు. అయితే ఇక్కడున్న బెనిఫిట్ ఏంటంటే.. ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లి ఖాతాలో 26వేలు జమ అయింది. ముగ్గురు పిల్లలుంటే 39వేలు, నలుగురు పిల్లలున్న వారికి 52వేలు జమ అయ్యాయి. గతంలో వీరంతా కేవలం 13వేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులు పెరిగారు, వారికి లభించే సొమ్ము కూడా పెరిగింది. దీంతో వైసీపీ కాస్త డీలా పడాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా కూటమిపై విమర్శలు చేయడానికి సోషల్ మీడియా టీమా సిద్ధమైంది. మీకు 15వేలు, మీకు 15వేలు అని హామీ ఇచ్చి ఇప్పుడు 13వేలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా 2 వేల రూపాయలు లోకేష్ ఖాతాలోకి వెళ్లాయని విమర్శలు మొదలు పెట్టారు. ఈ విమర్శలపై ఇప్పుడు లోకేష్ నేరుగా స్పందించారు.
ప్రజల్లో చర్చ..
లోకేష్ సవాల్ తో తల్లికి వందనం విషయం మరోసారి హైలైట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయనే విషయం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఒకరకంగా ఇది కూటమి ప్రభుత్వానికి ప్రచారం లాంటిది. అదే సమయంలో కట్ చేసిన ఆ 2వేల రూపాయలు దేనికి ఉపయోగిస్తారనే విషయంపై ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది.