Nellore Mayor Sravanthi : నెల్లూరులో మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైపోయింది టీడీపీ. నెల్లూరులో ప్రస్తుతం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ నిర్ణయించడంతో మేయర్ స్రవంతి కీలక ప్రకటన చేశారు.
మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ కలెక్టర్ను కలిసి రాజీనామా పత్రాన్ని ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. గిరిజన బిడ్డను ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారంటూ స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా.. అందులో అంతా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలోకి చేరారు.
తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై కుట్రలు చేసినవారికి ఉసురు తగులుతుందని శాపనార్దాలు పెట్టారు. తనకు మేయర్ పదవి ఇచ్చింది జగన్మోహన్రెడ్డి. ఆయనకు రుణపడి ఉంటా అని తెలిపారు. తన పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని పేర్కొన్నారు.
Also Read: మేయర్ కుర్చీ ఫైట్.. నెల్లూరు హైడ్రామా!
అనంతరం ఆమె భర్త జయవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. నా భార్య స్రవంతి దెబ్బకి టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు భయపడుతున్నారని తెలిపారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, టీడీపీ నేతలు గిరిధర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డిల రాజకీయ అంతం పలికే వరకు మా పోరాటం ఆగదు. వీళ్లంతా రాక్షసులు. ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని తీవ్ర ఆరోపణలు చేశారు. రేకుల షెడ్డులో ట్యూషన్ చెప్పిన నారాయణ రూ.వందల కోట్లు ఎలా సంపాదించాడో బయట పెడతా అని హెచ్చరించారు.