YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని ట్విస్టులు, సరికొత్త డైలాగులు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘కాక్రోచ్’ (బొద్దింకలు) వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన చేసిన ఈ కామెంట్లు సరికొత్త చర్చకు దారితీశాయి.
ఏపీలో మేమే కాక్రోచ్.. జగన్ సంచలనం
ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో జగన్ సరికొత్త పదజాలాన్ని తెరపైకి తెచ్చారు. ‘గుర్తుపెట్టుకో.. కాక్రోచ్లు లేస్తాయి. ఆంధ్రరాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో..’ అంటూ ఆయన చంద్రబాబుకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తప్పులు చేసినా కూడా ఒప్పుకోకుండా, ప్రజలను లేదా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ పోతే.. ఈ కాక్రోచ్లు బయటకు వస్తాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలం ఇదంటూ..
ప్రస్తుత కాలాన్ని, యువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ జగన్ ఆసక్తికరమైన పోలికలు తెచ్చారు. ఇప్పటి కాలం జెన్ జెడ్ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) లదని గుర్తుచేశారు. ఈ డిజిటల్ యుగంలో ప్రభుత్వం చేసే ప్రతి తప్పుడు పనిని గమనిస్తూ ఉంటారని, అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించేందుకు ఈ ‘కాక్రోచెస్’ రూపంలో సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
తప్పుడు పనులపై తిరుగుబాటు
ప్రభుత్వ వైఫల్యాలు, ఇబ్బంది పెట్టే ధోరణి ఎక్కువైతే ఈ కాక్రోచ్లు దానంతట అవే లేస్తాయని, మీ తప్పుడు పనులపై తిరుగుబాటు చేస్తాయని జగన్ హెచ్చరించారు. కీటకాల్లో ఎంత నొక్కినా చావకుండా మళ్లీ లేచే లక్షణం కాక్రోచ్లకు ఉంటుందనే ఉద్దేశంతోనే, రాజకీయంగా తమను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా పైకి లేస్తామనే అర్థంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి.
Also Read: నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే