Delhi News: రాజకీయాలు చేయవచ్చు.. అతిగా చేస్తే ఇబ్బందులు మాత్రం తప్పవు. వైసీపీ ఎంపీలకు ఈ విషయం బాగా తెలిసినట్టుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటోంది వైసీపీ. కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కేంద్రమంత్రి వద్దకు వెళ్లిన వైసీపీ ఎంపీలకు ఊహించని అనుభవం ఎదురైంది.
హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణ చేయడం, దీనిపై వచ్చే బుధవారం గవర్నర్ను కలవనున్నారు మాజీ సీఎం జగన్. కోటి సంతకాలతో సేకరించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు.
ఈ విషయంలో కేవలం రాష్ట్రంలో కాకుండా కేంద్రప్రభుత్వం వైపు నుంచి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి వైసీపీకి చెందిన ఎంపీలు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ను కలిశారు వైసీపీ ఎంపీలు.
మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ఓ వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. దీనిపై అసలు విషయం ఏంటని అడిగారట కేంద్రమంత్రి. వైసీపీ ఎంపీలకు కేంద్రమంత్రి నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్ విధానంలో వాటిని ఆ విధానంలో పూర్తి చేస్తున్నారని చెప్పడంతో ఎంపీలు షాకయ్యారట.
వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం లేదని, మీరు అంటున్నట్టుగా పీపీపీ విధానంలో జరుగుతున్నాయని మంత్రి అన్నారట. వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకుని పీపీపీ పద్ధతిలోనే జరుగు తున్నాయని ధృవీకరించారు. వెంటనే నిర్మల సీతారామన్.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా చెబుతున్నారని ప్రశ్నించారట.
మిగతా ఎంపీలు జోక్యం చేసుకుని.. పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడమ్ అని అన్నారట. వెంటనే కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ నోరు విప్పారు. నో.. నో.. మీరు ఇలాంటి వాటిపై దయచేసి తప్పుదోవ పట్టించవద్దని అన్నారట. ప్రజలను తప్పుదోవ పట్టినట్లుగా, తనను కూడా అలా చేస్తే ఎలా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ALSO READ: వివేకా హత్య కేసు బిగ్ ట్విస్ట్.. మళ్లీ విచారణకు కోర్టు ఆదేశం
కేంద్రమంత్రి నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో వైసీపీ ఎంపీలు ఖంగుతిన్నారు. అక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు వచ్చేశారట. ఈ విషయంపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ వేస్తున్న ఎత్తులు బూమరాంగ్ అవుతున్నాయి.
ఏపీలో వైద్య శాఖ మంత్రిగా బీజేపీ నేత సత్యకుమార్ ఉన్నారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు కూడా. ఏపీలో కూడా అదే విధంగా ఫాలో అవుతున్నామని చెప్పారు. అయినాసరే వైసీపీ మాత్రం ప్రైవేటీకరణంటూ గగ్గోలు పెడుతోంది.