Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును మళ్లీ పూర్తి దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.
వివేక హత్య కేసులో దర్యాప్తు కొనసాగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని సునీత కోర్టుకు తెలిపారు. అలాగే సీబీఐని సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసేలా ఆదేశించాలని కోరారు. వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్, వైఎస్ భాస్కర్రెడ్డి సోదరుడు కుమారుడైన అర్జున్రెడ్డి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగిందని సునీత తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. అర్జున్రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు వివేకా హత్య కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్జున్రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తునకు ఆదేశించింది.
వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, పలు అంశాలపై దర్యాప్తు అసమగ్రంగా ఉందని నిందితుల చెబుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టుకు వివేకా కుమార్తె సునీతారెడ్డి నివేదించారు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై డిసెంబర్ 6న వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. సునీత తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ఎస్ గౌతం వాదనలు వినిపించారు. సునీత తరఫు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.