Big Stories

Vizag Floating Bridge : విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. రెండురోజులకే ముక్కలైందా ? అధికారుల వివరణ ఏంటి ?

Andhra news today

- Advertisement -

Vizag Floating Bridge(Andhra news today): విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. రెండురోజుల ముచ్చటగా మిగిలిందా ? ప్రారంభమైన మూడోరోజే బ్రిడ్జ్ తెగిపోయిందా ? ఇవే వార్తలు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. VMRDA నిధులు రూ.1.60 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ వంతెనను.. ఆదివారం వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభమవ్వడంతో.. దానిపైకి వెళ్లి ఎంజాయ్ చేయాలని నగరవాసులు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ప్రారంభమైన రెండోరోజే బ్రిడ్జ్ తెగిపోయిందంటూ వార్తలొచ్చాయి. దాంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి.

- Advertisement -

ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి భాగం విడిపోయి.. సముద్రంలో కొంతదూరం కొట్టుకుపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం ప్రభుత్వానికి ఇంతటి నిర్లక్ష్యం తగదని ఆగ్రహం చెందారు. వంతెన కూలిపోయే సమయంలో దానిపై పర్యాటకులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని, లేకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారన్న ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : క్రికెట్ లో రాజకీయం.. హనుమ విహారి సంచలన నిర్ణయం

అయితే.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదని కలెక్టర్, VMRDA కమిషనర్ మల్లికార్జున తెలిపారు. బ్రిడ్జ్ నిర్వాహకులు T పాయింట్ వద్ద దానిని విడదీసి.. దాని సామర్థ్యం, పటిష్ఠతను పరిశీలించారని తెలిపారు. సముద్రంలో అలల తాకిడి అధికంగా ఉన్నపుడు ఇలాంటివి తరచూ చేస్తూ ఉండాలని చెబుతూ.. T పాయింట్ వద్ద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను విడదీసిన వీడియోను ఆయన షేర్ చేశారు.

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇంకా ట్రయల్ రన్ లోనే ఉందని, మాక్ డ్రిల్ చేస్తున్నామని వివరణ ఇచ్చారు. బ్రిడ్జ్ తెగిపోయిందంటూ అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు. బ్రిడ్జి భద్రతపై ఆందోళన అక్కర్లేదని, సందర్శకులకు ఎలాంటి హాని జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్రిడ్జి చుట్టూ రెండు పడవలు, గజ ఈతగాళ్లు ఉంటారని, లైఫ్ జాకెట్ ఇస్తామని చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News