Tirumala Laddu Report: తిరుమల కల్తీ లడ్డూ నివేదిక అంశం క్లైమాక్స్కి చేరిందా? ఏక సభ్య కమిటీ తన నివేదిక ఏపీ ప్రభుత్వానికి అందిందా? కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు అధికారులపై చర్యలు తప్పవా? మరి రాజకీయ నేతల మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది వైసీపీ నేతలు వెంటాడుతున్నాయి.
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డు నివేదిక
తిరుమల కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం చివరి అంకానికి చేరింది. సీబీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఏక సభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
అప్పటి ఈఓ అనిల్ సింఘాల్ తీరును తప్పుపట్టింది ఏక సభ్య కమిటీ. కల్తీ నెయ్యికి దారి తీసిన పరిస్థితిని అప్పటి ఈవో అడ్డుకోలేకపోయారని ప్రస్తావించిందట. అంతేకాదు నెయ్యికి సంబంధించిన రూల్స్ సడలించినా ఆయన బోర్డును ప్రశ్నించలేదని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అధికారులపై చర్యలు, రాజకీయ నేతల మాటేంటి?
ప్రొక్యూర్మెంట్ జీఎం, ఎఫ్ఏసీఏలదీ తప్పేనని తేల్చింది. సింఘాల్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సింఘాల్ తోపాటు బాధ్యులైన అధికారులపై వేటు పడడం ఖాయంగా తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తి, వాటిని మరింత సులభతరం చేశారని ప్రస్తావించిందని తెలుస్తోంది.
దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలోని సారాంశం. టీటీడీకి నెయ్యి సరఫరా పంపిణీ లోపరహితంగా ఉండాలని, బిడ్డింగ్లో నాణ్యత ఉండాలని ఏకసభ్య కమిటీ సూచన చేసింది. సీబీఐ సిట్ నివేదికతో అప్పటికి ఈవోగా ఉన్న సింఘాల్ను ప్రభుత్వం తొలగించింది.
ALSO READ: విశాఖ ఉక్కుకు భారీ ఊరట.. మరో రూ. 8 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!
మరికొందరు అధికారులపై వేటు పడడం ఖాయంగా తెలుస్తోంది. అధికారుల ఓకే.. ఇందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నేతల మాటేంటి? అన్నదే అసలు ప్రశ్న. ఏక సభ్య కమిటీ నివేదికపై ఆరా తీసే ప్రయత్నం చేస్తోందట వైసీపీ. అందులో వైసీపీకి చెందిన నేతల పేర్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో పని చేసిన ఇద్దరు టీటీడీ మాజీ ఛైర్మన్లపై జీవితకాలం ఆ పదవికి అనర్హులుగా ప్రకటించే అవకాశమున్నట్లు అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయం.