AP Reorganization Act Amendment Bill: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా వేసిన అడుగులు తుది దశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడం ద్వారా అమరావతి భవిష్యత్తుపై ఉన్న నీలినీడలు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఇప్పుడు తుది ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపనుంది.
గత ఐదేళ్లుగా రాజధాని మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఎదుర్కొన్న అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతికి చట్టబద్ధమైన రక్షణ ఉండాలని భావించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేపట్టింది. ఉభయ సభల ఆమోదం లభించడంతో, అమరావతి ఇకపై కేవలం ఒక ప్రాంతం కాదు, అది చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా స్థిరపడనుంది.
కేంద్ర క్యాబినెట్, పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలించి ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రపతి సంతకం పూర్తి కాగానే, కేంద్ర హోం వ్యవహారాల శాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘అమరావతి’ పేరు అధికారికంగా రికార్డుల్లో నమోదవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, పార్లమెంటు అనుమతి లేకుండా రాజధానిని మార్చడం సాధ్యం కాదు.
ఈ చట్టబద్ధతతో అమరావతి నగర నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల నుండి నిధుల సేకరణ సులభతరం కానుంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వంటి సంస్థలు ఇప్పటికే రాజధాని అభివృద్ధికి సుముఖత వ్యక్తం చేశాయి. చట్టబద్ధత లభించడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు, న్యాయ పోరాటాలకు తగిన ఫలితం లభించిందని వారు భావిస్తున్నారు.
Read Also: సినీ హీరోలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాకే.. నాతో మాట్లాడాలంటూ..?