మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ హీరోల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తాను హీరోలను డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని కోరానని గుర్తు చేశారు. సెలబ్రిటీలను చూసి యువత ప్రభావితం అవుతుందని అందుకే వారిలో మార్పు వస్తే సమాజంలో మంచి మార్పు వస్తుందని తాను ఆశించినట్లు పేర్కొన్నారు. అయితే టెస్టులు చేయించుకోవాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ఎమ్మెల్యేగా మాట్లాడే నైతిక హక్కు తనకు ఉందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది ఆంధ్రా వాళ్లు సహించలేకపోవడం విచారకరమన్నారు. నిజంగా తనతో మాట్లాడాలని అనుకుంటే ముందుగా డ్రగ్ టెస్టులు చేయించుకుని రావాలని హీరోలకు సవాల్ విసిరారు. ఇలాగే విమర్శలు కొనసాగిస్తే తెలంగాణ ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవుడైన శ్రీరాముడే ప్రజల కోసం సీతాదేవికి అగ్నిపరీక్ష పెట్టాడని అటువంటిది సమాజ హితం కోరి తాను అడిగిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు.
రాజకీయ నాయకులకు లైవ్ డిటెక్టివ్ టెస్టులు పెట్టాలని ఒక సినీ నటుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాను ఓపిక ఉన్నంత వరకు వేచి చూస్తానని ఆ ఓపిక నశిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. టీవీ ఛానళ్లలో తాను మాట్లాడిన అంశంపై పబ్లిక్ పోల్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే తాను మాట్లాడింది తప్పో ఒప్పో ప్రజలకే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టి పీడిస్తోందని ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తల్లిదండ్రులు ఆలోచించాలని కోరారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే వారు వ్యసనాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు. యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత సెలబ్రిటీల మీద కూడా ఉందన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా అనవసర రచ్చ చేయడం మానుకోవాలని సూచించారు.
ALSO READ: బీఆర్ఎస్ దోపిడీపై పదేళ్లు ఎందుకు మౌనం? కిషన్ రెడ్డిని నిలదీసిన భువనగిరి ఎంపీ