Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, అనధికారిక వ్యాపారాలపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో కొందరు ‘ఫ్యాన్ పేజీల’ ముసుగులో పవన్ పేరు, ఫొటోలు, వీడియోలను వాడుతూ కంటెంట్ను ప్రచారం చేస్తున్నారని కోర్టు గుర్తించింది. అలాగే కొన్ని వెబ్సైట్లు ఆయన అనుమతి లేకుండా, ఆయన చిత్రంతో కూడిన వస్తువులను (Merchandise) విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని, ఇది అనధికారిక దోపిడీ కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలా చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేస్తూ, తక్షణమే అటువంటి చర్యలను అడ్డుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్ఫేక్ టెక్నాలజీ పెరిగాక సెలబ్రిటీల ఇమేజ్ను దుర్వినియోగం చేయడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కంటే ముందే టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా తమ వ్యక్తిత్వ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ పేరు, ఫొటో, గొంతును వాణిజ్యపరంగా లేదా తప్పుదోవ పట్టించేలా వాడకూడదని వారు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో నడవడంతో, సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి క్రేజ్ను వాడుకునే సంస్థలకు, సోషల్ మీడియా ఖాతాలకు గట్టి హెచ్చరిక వెళ్లినట్లయింది.
Read Also: AP NEWS: ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్.. పవన్ ప్లాన్ ఇదేనా!