ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నాయకులు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయాల్లో వారసులను ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకుల ప్లాన్ మాత్రమే కాదు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన వారు కూడా పిల్లల్ని స్థానికంగా బలోపేతం అవ్వటానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ బెస్ట్ ఛాన్స్గా చూస్తున్నారు. దీనికోసం.. అధికార, ప్రతిపక్షంలో ఉన్న సీనియర్ పొలిటిషియన్స్ తమ వారసుల్ని బాగా యాక్టివ్ అవ్వమని ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో వారసుల హడావుడి కనిపిస్తోంది. ప్రత్యేకించి.. ఉత్తరాంధ్రలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఎవరు యువ నాయకులు రాజకీయాల్లో వస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లాది ప్రత్యేక స్థానం. ఈ జిల్లాకు చెందిన ఎంతో మంది నేతలు రాజకీయాల్లో రాణించారు. తమదైన ముద్ర చూపించారు. దశాబ్దాలుగా రాజకీయాలు చేశారు. కానీ మొన్నటి 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడంతో.. సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా సైడ్ అయిపోయి.. కొత్తవారికి, యువతకు ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు ఆ ఎన్నికల్లో సీనియర్ నాయకుల వారసులకు టిక్కెట్లు దక్కలేదు. అటువంటి వారంతా ఇప్పుడు తమ వారసుల రాజకీయ భవిష్యత్పై దృష్టిసారిస్తున్నారు. ఏపీలో త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు పూర్తై.. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ తమ రాజకీయ వారసులను పోటీ దించేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఉత్తరాంధ్రలో సీనియర్ రాజకీయవేత్త బొత్స సత్యనారాయణ తనతో పాటు వారసులను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వారు కూడా బొత్స సత్యనారాయణతో కలసి నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే.. అందర్నీ ఆకర్షిస్తోంది బొత్స కుమార్తె బొత్స అనూషనే. ఎందుకు అంటే.. గత 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం చీపురుల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ తరుపున పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ బొత్స అనూషనే పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన పలు కార్యక్రమాల్లోనూ బొత్స అనూష యాక్టివ్గా పాల్గొంటున్నారు. ప్రత్యేకించి మెడికల్ కాలేజీల పీపీపీ అంశంపై డాక్టర్ అయిన బొత్స అనూష ప్రజలకు చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో బాగా యాక్టివ్గా వర్క్ చేశారన్న విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఎందుకంటే ఉద్దండులైన విజయనగరం జిల్లా సీనియర్ నేతలందరితో కలుపుగోలుతనంతో అనూష వ్యవహరించారు. ప్రోటోకాల్ పద్దతి ప్రకారం వారికి మర్యాద ఇచ్చి వారి మన్ననలను పొందారు. దీంతో అనూషలో బొత్స రాజకీయ వారసత్వాన్ని స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించారు.
బొత్స సత్యనారాయణ వారసురాలుగా అనూష రాజకీయాల్లోకి వస్తున్నారని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. దీనికి కారణం.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా గరివిడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఘనంగా వేడుక నిర్వహించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకను బొత్స కూతురు అనూషనే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో కో ఆర్డినేట్ అయి.. కార్యక్రమాన్ని విజయవంతం చేశారని టాక్ వచ్చింది. విజయనగరం జిల్లాలోనే కాదు.. ఉత్తరాంధ్రలోనే మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుక చాలా ఘనంగా జరిగిందని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అంటున్నారు. ప్రత్యేకించి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన వేడుకకు చీపురుపల్లి చుట్టుపక్కల నుంచి వేల మంది హాజరై.. కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతో ఈ వేడుక తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పెద్దల దృష్టికి వెళ్లిందని సమాచారం.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. బొత్స వారసులు పాలిటిక్స్లో ఎంట్రీ అంటే ఆషామాషీగా ఉండదు. అయినా సరే.. బొత్స కుమార్తె పార్టీ నాయకులు అందరితో ముచ్చటిస్తూ.. వారి మన్నలను చూరగొంటున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లోనూ ప్రజలతో సౌమ్యంగా సంభాషిస్తూ.. వారిని ఆకర్షించారు. ఓ వైపు బొత్స సత్యనారాయణ గారి తరుపున పార్టీ కార్యక్రమాలు, ప్రజల నుంచి సమస్యలు వింటూనే.. మరోవైపు సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రానున్న ఎన్నికల నాటికి జడ్పీ ఛైర్మన్గానో, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ప్రజాప్రతినిధిగా ఏదో ఒక చట్టసభలో అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఎన్నికల నాటికి బొత్స కుటుంబం నుంచి ఎవరికి సీటు వస్తుందో, ఎవరికి ఇస్తారో అన్న దానికి బొత్స అనూష రాక చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అయిందని అభిమానులు భావిస్తున్నారు.దీనిపై వైఎస్ఆర్సీపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదీ ఉత్కంఠగా మారింది. దీనికి తోడు పార్టీ అధిష్టానం దృష్టిలో బోత్స అనూష సేవాతోపాటు పార్టీ కార్యక్రమాలను అధిష్టాన పెద్దలు గమనిస్తున్నారు. వీటిన్నిటికి తోడు వైద్యురాలితోపాటు ఉన్నత విద్యావంతురాలిగా ఉండటం అనూష బలాలుగా చెప్పుకొస్తున్నారు. ఆమె అందరితో సౌమ్యంగా వ్యవహరిస్తున్న తీరు పార్టీ పెద్దల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది. మొత్తానికి బొత్స ఫ్యామిలీ నుంచి మరోతరం రాజకీయ వారసురాలు ఎంట్రీ దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.