దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు ఓటర్లలో నెలకొన్న బలమైన మార్పు ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు పాలన నచ్చితే మళ్లీ గెలిపిస్తారని.. ఒకవేళ నచ్చకపోతే ఏమాత్రం కనికరం లేకుండా ఓడిస్తారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన విశ్లేషించారు. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం మార్పు కోరికకు స్పష్టమైన సంకేతమని అభిప్రాయపడ్డారు.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపడం విశేషమని కొనియాడారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అద్భుత విజయాన్ని అందుకున్న విజయ్ని పవన్ మనసారా అభినందించారు. ఈ ఎన్నికల బరిలో అన్నాడీఎంకే – భాజపా కూటమి చేసిన పోరాటం కూడా ఎంతో బలమైనదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నాలుగు రాష్ట్రాలు సహా ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల చైతన్యం మరోసారి స్పష్టంగా కనిపించిందని పవన్ కల్యాణ్ వివరించారు. తమిళనాడుతో పాటు కేరళ – పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని చెప్పారు. అస్సాం – పుదుచ్చేరి రాష్ట్రాల్లో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రజల మనసులను గెలుచుకున్న భాజపా విజయం వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష ఉందని ప్రశంసించారు.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ – కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత కొన్నేళ్లుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందని పవన్ తెలిపారు. క్షేత్రస్థాయిలో వారు పడిన శ్రమ వల్లే అక్కడ పార్టీ పటిష్టమైందని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన ఫలితాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నాయకులు నితిన్, నబీన్ తదితరులకు పవన్ కల్యాణ్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడని.. వారి తీర్పును అందరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. దళపతికి చిరు, జగన్ ప్రత్యేక అభినందనలు