Pithapuram: పిఠాపురంలో జనసేన ప్రక్షాళనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం జనసేన ఐదుగురు సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. అయితే మర్రెడ్డిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఫైవ్ మెన్ కమిటీ నుంచి అధిష్టానం ఆయనను తొలగించింది. మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిషోర్ ను కమిటీలో సభ్యుడిగా నియమించింది.
డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పిఠాపురంలో గత కొంతకాలంగా వర్గవిభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో జనసేన అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రక్షాళనపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఐదుగురు సభ్యుల కమిటీ నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ను తొలగించారు. గతంలో పిఠాపురంలో పార్టీ ఇన్ ఛార్జ్గా మర్రెడ్డి పనిచేశారు. రెండు నెలల క్రితం ఇన్ ఛార్జ్ స్థానంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఫైవ్ మెన్ కమిటీని నియమించారు. తాజాగా మర్రెడ్డిపై ఫిర్యాదులు రావడంతో కమిటీ నుంచి ఆయనను తొలగించారు.
డిప్యూటీ సీఎం హోదాలో పాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు జనసేన అధినేతగా పార్టీని పటిష్టం చేసేందుకు పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. పిఠాపురం పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ పార్టీ పనితీరుకు ఆటంకంగా మారిన అంశాల పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మర్రెడ్డిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న చేబ్రోలుకు చెందిన ఓదూరి కిషోర్ను ఫైవ్ మెన్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. తాజా నిర్ణయంతో పార్టీ క్యాడర్ కు పవన్ బలమైన సంకేతాలు ఇచ్చారు. తప్పు చేస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Red Sanders Book: ఎర్రచందనం స్మగ్లింగ్ పై డాక్యుమెంటరీ.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కు పవన్ ప్రశంసలు
అసెంబ్లీ ఎన్నికల ముందు మర్రెడ్డి శ్రీనివాస్ రావును జనసేన పిఠాపురం ఇన్ ఛార్జ్ గా నియమించింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినా నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను మర్రెడ్డి పూర్తి స్థాయిలో చక్కబెట్టలేకపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తో ఆయనకు పొసగడంలేదు. నియోజకవర్గంలో పాత కాపులను మర్రెడ్డి పూర్తిగా పక్కన పెట్టి, తనకు సొంత వర్గాన్ని ఏర్పరచుకున్నారని కార్యకర్తల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితులైన డాక్టర్ పిల్లా శ్రీధర్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నా చక్రధర్ రావు వంటి కీలక నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అలాగే ఉప్పాడ మత్స్యకారుల విషయంలోనూ ఆయన తీరుపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఎట్టకేలకు ఆయనను కమిటీ నుంచి తప్పించింది.