Perni Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కొత్తేమీ కాకపోయినా.. ఈసారి ఒక చిన్న పిల్లాడిని వివాదాల్లోకి లాగడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో పేర్నినానిపై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు సాధారణ నెటిజన్లు సైతం పేర్ని నాని వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. పొలిటికల్ వార్ లోని చిన్నపిల్లాడ్ని లాగడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.
మచిలీపట్నం వైసీపీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ను నందమూరి తారక రామారావుతో పోలుస్తూ టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘దేవాన్ష్ కళ్ళజోడు తీస్తే ఎన్టీ రామారావులా ఉండడం ఏంటి? ఉంటే ఖర్జురా నాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి’ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ శ్రేణుల అతి భజనకు హద్దు, అదుపు లేకుండా పోతోందంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంపై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో పేర్ని నానిపై విరుచుకుపడతున్నారు.
దేవాన్ష్ కళ్ళజోడు తీస్తే రామారావులా ఉండడం ఏంటి ??
ఉంటే ఖర్జురా నాయుడు లేదా చంద్రబాబు లా ఉండాలి.
– పేర్ని నాని pic.twitter.com/67dRJWEzxJ
— cinee worldd (@Cinee_Worldd) May 29, 2026
పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమేనని కానీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం, అవగాహన కూడా లేని ఒక చిన్న పిల్లాడిని ఈ రాజకీయ బురదలోకి లాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానాల పరంగా ఉండాలే తప్ప.. ఇలా కుటుంబ సభ్యులను, ముఖ్యంగా చిన్న పిల్లల రూపాలను హేళన చేస్తూ మాట్లాడటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ‘పిల్లాడి ముఖ కవళికలపై వ్యాఖ్యలు చేస్తారా? ఇదేనా మీ సంస్కారం’ అంటూ సాధారణ నెటిజన్లు సైతం పేర్ని నానిపై విరుచుకుపడుతున్నారు.
ఏపీ రాజకీయాలు.. గత కొంతకాలంగా సాగుతున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయికి పడిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య పొలిటికల్ ఫైట్ కాస్తా వ్యక్తిగత కక్షల రూపంలోకి మారిపోవడం న్యూట్రల్ ప్రజలకు వెగటు పుట్టిస్తోందని పేర్కొంటున్నారు. విధానాల పరంగా, ప్రజా సమస్యల ప్రాతిపదికన విమర్శలు చేసుకోవాల్సింది పోయి.. కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను, చివరకు ఏ రాజకీయాలూ తెలియని చిన్న పిల్లలను కూడా ఈ బురదలోకి లాగడం సరైన రాజకీయం అనిపించుకోదని హితవు పలుకుతున్నారు.
Also Read: నెక్స్ట్ వచ్చేది మేమే.. కాంగ్రెస్ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్
కొందరు నేతలు మైక్ ముందుకు వస్తే.. భాషపై నియంత్రణ కోల్పోయి, సంస్కారాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం ఏపీలో ఒక ట్రెండ్గా మారిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారం కోసం, పార్టీ అధినేతల దగ్గర మార్కుల కోసం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నాయో ఒకసారి ఆలోచించాలని సూచిస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం ఎలాంటి విమర్శలకైనా వెనకాడబోం అనేలా ఉన్న కొందరి నేతలు తీరును సామాన్య జనం సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయాలంటే ప్రజల జీవితాలను మార్చేవి కావాలి కానీ, ఇలా ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు కించపరుచుకునేలా విమర్శలు చేసుకోవడం సరికాదని వ్యక్తపరుస్తున్నారు.
Also Read: కేసీఆర్ పెద్ద పాలేరు, కేటీఆర్ చిన్న పాలేరు.. గాంధీ భవన్లో గజ్జెల కాంతం ధ్వజం!