Nellore Pickpockets:మంత్రుల పర్యటన అనగానే నాయకుల హడావుడి, కార్యకర్తల హంగామా మామూలే. మంత్రి దృష్టిలో పడాలని కొందరు.. తమ విజ్ఞప్తులు వినిపించాలని ఇంకొందరు.. కనీసం మంత్రితో ఒక సెల్ఫీ దిగాలని యువత ఆతృతగా ఉరుకులు పరుగులు పెడుతుంటారు. సరిగ్గా ఇదే సందర్భాన్ని జేబు దొంగలు అందివచ్చిన అవకాశంగా మలుచుకున్నారు. మంత్రుల పర్యటనలోనే ఆ దొంగలు తమ ప్లాన్ను అమలు చేశారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ ఆలయాన్ని మంత్రులు MD ఫరూఖ్, వాసంశెట్టి సుభాష్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దర్శించుకున్నారు. ప్రముఖులు రావడంతో ఆలయం దగ్గర భారీగా జనసందోహం చేరింది. సరిగ్గా ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు రెచ్చిపోయారు. వీఐపీల చుట్టూ చేరి.. నాయకులకు జై కొడుతూనే భక్తుల జేబులు కొట్టేశారు. ఆలయ ఉద్యోగి నుంచి 5వేల నగదు.. అలాగే సీతారాంపురం నాయకుల దగ్గర నుంచి 30వేల రూపాయల నగదును క్షణాల్లో కాజేశారు.
తమ జేబులు ఖాళీ కావడాన్ని గుర్తించిన బాధితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులున్న చోటే ఇంత ధైర్యమా అంటూ అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దొంగలను గుర్తించారు. పారిపోతున్న దొంగల చొక్కా పట్టుకుని, అక్కడి నుంచి ఈడ్చుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లారు.
పోలీసుల ఈ స్పీడ్ యాక్షన్ చూసి అక్కడివారంతా షాక్ అయ్యారు. నిందితుల నుంచి చోరీ చేసిన నగదును వెంటనే స్వాధీనం చేసుకుని, బాధితులకు అప్పగించారు. ప్రముఖుల భద్రత మధ్యే రెచ్చిపోయిన జేబు దొంగల ఆటను పోలీసులు ఇలా నిమిషాల్లో కట్టడి చేశారు.