Huzurabad Hospital: పేద ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో కొనసాగుతున్న ప్రభుత్వ యునాని వైద్యశాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అసలు ఇక్కడ యునాని విభాగం ఉందన్న సమాచారం తెలిపే కనీస నామఫలకం కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
ఈ విభాగంలో ఒక వైద్యురాలు, ఫార్మసిస్ట్, అటెండర్ ఉన్నప్పటికీ సిబ్బంది బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా వైద్యురాలి జాడ లేదు. గది తలుపులు తెరిచి, లోపల ఫ్యాన్ తిరుగుతున్నా వైద్యురాలు మాత్రం సీట్లో కనిపించలేదు. మరోవైపు ఫార్మసిస్ట్ కూడా రాదు వచ్చిన నిర్దేశిత గదిలో ఉండకుండా, ఆసుపత్రిలోని ఇతర గదుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప తన సీట్లో మాత్రం కూర్చోవడం లేదు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన రోగులు, వృద్ధులు విసిగి వేసారి వెనుదిరుగుతున్నారు.
Also read: పెళ్లాం, అత్త, ఇద్దరు కూతుళ్లను కాల్చేసిన డాక్టర్… తీరా ఆరా తీస్తే దేశాన్నే షాక్ చేసిన క్రైమ్ స్టోరీ
తీవ్రమైన మోకాళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పైఅంతస్తు మెట్లు ఎక్కి వచ్చే పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. డాక్టర్ గైర్హాజరు, ఫార్మసిస్ట్ గదులు తిరుగుతూ అందుబాటులో లేకపోవడంతో మందులు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా రోగులు ప్రశ్నిస్తే “డాక్టర్ వస్తేనే మందులు ఇస్తాం, రేపు రండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ తప్పించుకుంటున్నారు.
రోజూ ఇదే తంతు పునరావృతమవుతోందని, యునాని వైద్యశాల పేరుకే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ నాయకుడు గడ్డం విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొడుతున్న వైద్యురాలితో పాటు, గదిలో ఉండకుండా ఆసుపత్రి అంతా తిరుగుతూ కాలయాపన చేస్తున్న ఫార్మసిస్ట్పై ఉన్నతాధికారులు తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యం వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Also read: డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!