PM Kisan Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తో అనుసంధానిస్తూ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ నెలలోనే రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ‘పీఎం కిసాన్’ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడిసాయం కింద ఏకరాకు రూ.2 వేలు జమచేయనున్నారు. ఈ విడతతో కలిపి ఇప్పటి వరకూ రూ.3.70 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ కింద ప్రయోజనం చేకూరనుంది.
పీఎం కిసాన్ పథకం కింద అర్హత గల రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తుంది కేంద్రం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమం. ఓటీపీ, బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఆధార్e-KYC పూర్తి చేసిన రైతులకు నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో నో యువర్ స్టేటస్, పోస్టల్ బ్యాంక్ ద్వారా ఆధార్ లింక్డ్ బ్యాంకింగ్ వంటి అప్డేట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం కిసాన్ యాప్ లో రైతులు తమ దరఖాస్తు స్టేటస్, చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడతగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.7,000 జమ చేసింది. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000 జమ చేశారు. రాష్ట్రంలో మొత్తం 47 లక్షలకు పైగా రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు.
ఈ నెల 19న పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల చేయనున్నారు. గతంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడంతో.. ఈసారి కూడా ఒకేసారి రూ.7000 రైతుల ఖాతాల్లో జమ చేస్తారని తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులు విడుదలైనా వెంటనే ఏపీ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద తమ వాటా చెల్లించే వీలుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి ఏపీ రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ అయ్యే అవకాశం ఉంది.
రైతులకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ఏటా రూ.6 వేలు ఇస్తుండడంతో, ఏపీ ప్రభుత్వం మరో రూ.14 వేలు జోడించి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ-కేవైసీ నమోదు చేయని రైతులకు డబ్బు జమ కాకపోవచ్చు. ఈ-కేవైసీ పెండింగ్ ఉన్న రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో లేదా ఎస్ఎస్సీ కేంద్రాల్లో కేవైసీ పూర్తి చేయవచ్చు.