Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆమె తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. అమ్మవారి దర్శనం పూర్తయ్యాక రాష్ట్రపతి తిరుమలకు బయలుదేరారు. ఈ పర్యటనలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్ జిల్లా కలెక్టర్ ఎస్ వేంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు టీటీడీ జేఈవో వి వీరబ్రహ్మం సివిఎస్వో కేవి మురళీకృష్ణ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనంతపురం డీఐజీ సీమోషీ ఘోష్ టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పద్మావతి అతిథి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు.
రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి రాకతో భక్తులలో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఉన్నతాధికారులు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆమె పర్యటన సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి.
ALSO READ: 5K Run for Peace: హైదరాబాద్లో 5K రన్ ఫర్ పీస్లో పాల్గొనండి.. ఈజీగా రూ.25,000 గెలుచుకోండి