Telangana Panchayat Elections 2025: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై ఏర్పాటు చేసిన ‘డెడికేటెడ్ కమిషన్’ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో ప్రధానంగా పంచాయతీలు మరియు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై స్పష్టమైన సిఫార్సులు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ కమిషన్ ఈ నివేదికను రూపొందించింది. దీంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లయింది.
ఈ నెల 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరగనుంది. ఈలోపే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, కోర్టుకు నివేదించాలని ప్రభుత్వం భావిస్తోంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, హైకోర్టు విచారణ రోజైన ఈనెల 24వ తేదీన లేదా 25వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రాజకీయ సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, ఎన్నికల నిర్వహణకు యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) రాణి కుముదిని రంగంలోకి దిగారు. గురువారం హైదరాబాద్ నుండి ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి మరియు ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాణి కుముదిని అధికారులను ఆదేశించారు.
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, వచ్చిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అక్కడ కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఖరారు చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక ఎన్నికల సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఉంచాలని చర్చించారు. మొత్తానికి అధికార యంత్రాంగం పంచాయతీ పోరుకు సర్వసన్నద్ధమవుతోంది.