Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ప్రత్యేక విమానంలో విశాఖలోని ఐఎన్ఎస్ (INS) డేగ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రాష్ట్రపతి నేరుగా బీచ్ రోడ్డులో ఉన్న నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు.
ముఖ్య అతిథిగా హాజరు
అనంతరం నగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) మొదటి స్నాతకోత్సవ వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి, దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువత పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పంచుకున్నారు.
నేను కూడా మారుమూల గ్రామం నుంచి వచ్చినదాన్నే..
స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులను ఉద్దేశించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ‘నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్ను. ఈ రోజు ఇంతమంది గిరిజన, ఇతర వర్గాల యువతీయువకులకు పట్టాలు అందించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో ఇంకా వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను ఎప్పటికీ మరవకూడదని ఆమె విద్యార్థులకు హితవు పలికారు. జీవితంలో ముందుకు వెళ్తూనే, వెనకబడిన పేద ప్రజల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
Also Read: రైతు భరోసా ఆపే ప్రసక్తే లేదు.. హరీష్, కేటీఆర్ అబద్ధాలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్!
అబ్దుల్ కలాం ఆదర్శం కావాలి..
‘వికాసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని రాష్ట్రపతి యువతకు దిశా నిర్దేశం చేశారు. దేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి పర్యటన నిమిత్తం విశాఖ నగరం మూడంచెల భద్రతా వలయంలోకి వెళ్ళింది. ముఖ్యంగా బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాలను పోలీసులు ‘నో డ్రోన్ జోన్’గా ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. విశ్వవిద్యాలయ మొదటి ఘట్టాన్ని విజయవంతంగా ముగించుకున్న అనంతరం, సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ నుంచి తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమైంది.