Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: ‘పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి,అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ పాలకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రంపై బావ, బామ్మర్దులు (కేటీఆర్, హరీష్ రావు) అడ్డగోలుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతాంగం తిప్పికొట్టాలి’అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
హరీష్ రావు, కేటీఆర్ రోజుకో అబద్ధం
పది సంవత్సరాల ఆనాటి పాలనలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేటీఆర్ లు కలిసి రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పదేళ్లు మంత్రిగా పనిచేశాక కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్న తీరు బాధాకరమని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.గత ప్రభుత్వ హయాంలో రైతుల కోసం జరిగిన ఖర్చుతో పోలిస్తే, తమ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందని గణాంకాలతో సహా వివరించారు.
Also Read: ఎయిర్పోర్టు నుంచి నిధుల వరకు… కేంద్రం సమాధానం చెప్పాలి- మంత్రి పొన్నం
గత ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు
గత ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం కేవలం 2,88,670 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అంటే నెలకు సగటున 2,532 కోట్లు, ఏడాదికి 30,364 కోట్లు మాత్రమే వెచ్చించారన్నారు. కానీ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలోనే 1,56,496 కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసిందన్నారు. అంటే నెలకు 5,217 కోట్ల చొప్పున, ఏడాదికి 62,604 కోట్ల రూపాయలను రైతు సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామన్నారు. ఇది గత పాలకులు ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు అని ఆయన స్పష్టం చేశారు.గత పాలకులు తెచ్చిన 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తమ ప్రభుత్వం మోస్తోందని గుర్తు చేశారు. ఆ అప్పులకు సంబంధించి కేవలం రెండున్నర ఏళ్లలోనే 2,08,557 కోట్ల రూపాయలను బ్యాంకుల వడ్డీలు, అసలు చెల్లింపులకే ఖర్చు చేశామని తెలిపారు.
రైతు భరోసా నిరంతరాయం
ఆర్థికంగా ఇన్ని చిక్కులున్నా, ఎక్కడా వెనకడుగు వేయకుండా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆరు నూరైనా సరే రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు. రైతు రుణమాఫీ చేసిన తరహాలోనే సన్న వడ్లకు బోనస్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు భరోసాను నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులంతా వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులను కోరారు.